షారుక్ కు బిగ్ రిలీఫ్..ఆర్యన్ కు బెయిల్

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌ అరెస్టు వ్యవహారం సినీ థ్రిల్లర్ ను తలపించేలా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఆర్యన్ విడుదలకు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే కోట్ల రూపాయల లంచం డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపాయి. ఇక, బాలీవుడ్‌ సెలబ్రిటీలను వాంఖడే బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మంత్రి నవాబ్ మాలిక్ చేసిన ఆరోపణలపై విచారణ జరుగుతోంది.

మరోవైపు, సాంకేతిక కారణాలతో మొదటిసారి ఆర్యన్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడం…ఆ తర్వాత బెయిల్ వ్యవహారం వాయిదాల మీద వాయిదాలు పడడం చర్చనీయాంశమైంది. సెలబ్రిటీ హోదాలో ఉన్న ఆర్యన్ కు బెయిల్ రాకపోవడంపై రాజకీయ కోణంలోనూ కొందరు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా షారుక్ ఖాన్ కు ఊరట కలిగిస్తూ ముంబై హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది.

గత 3 రోజులుగా ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై జరిగిన వాదనలు నేటితో ముగిశాయి. దీంతో, గురువారంనాడు ఆర్యన్ ఖాన్‌ తోపాటు అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ దమేచాలకు బెయిల్ మంజూరైంది. ఆర్యన్ తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు.
తమ క్లయింట్ ఒక అతిథిగానే ఆ క్రూయిజ్ షిప్ లో పార్టీకి వెళ్లాడని, అతడి వద్ద డ్రగ్స్ ఏమీ దొరకలేదని ముకుల్ రోహత్గీ వాదించారు.

తమ క్లయింట్లను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని, ఈ చిన్న కేసులో అవసరం లేకపోయినా వారిని అరెస్ట్ చేశారని వాదనలు వినిపించారు. నేరం రుజువైతే ఏడాది శిక్ష పడే కేసులో తాము బెయిల్‌ అడుగుతున్నామని అన్నారు. ఆర్యన్ ఖాన్ పక్కన ఉన్న వ్యక్తి వద్ద డ్రగ్స్ దొరికితి ఆర్యన్ ను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అంతకుముందు, అరెస్టయిన వెంటనే మేజిస్ట్రేట్ కోర్టులో ఆర్యన్ తరఫు న్యాయవాది వేసిన బెయిల్ పిటిషన్‌…సాంకేతిక కారణాల వల్ల తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముంబై హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ దాఖలైంది.