సీఎం జ‌గ‌న్‌తో అక్కినేని నాగార్జున భేటీ.. ఏం చ‌ర్చిస్తారు?

సినీ హీరో.. అక్కినేని నాగార్జున స‌హా.. ప‌లువురు ముఖ్య నిర్మాత‌లు.. నేడు సాయంత్రం 3-5 గంట‌ల మ‌ధ్య ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో భేటీ కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ బృందం చేరుకుంది. హీరో అక్కినేని నాగార్జునతోపాటు.. ముఖ్య‌ నిర్మాతలు ప్రీతం రెడ్డి, నిరంజన్ రెడ్డి. కూడా రావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన విజయవాడ బయల్దేరిన అక్కినేని నాగార్జున బృందం సాయంత్రం వ‌ర‌కు విజ‌య‌వాడ‌లోనే బ‌స చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

మ‌ధ్యాహ్న భోజ‌నం విజ‌య‌వాడ‌లోనే ముగించుకుని.,. మూడు గంట‌ల‌కు తాడేప‌ల్లి వెళ్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేబినెట్ భేటీలో ఉన్నారు. స‌చివాల‌యంలో జ‌రుగుతున్న ఈ స‌మావేశం మ‌ధ్యాహ్నం మూడు లేదా నాలుగు గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. అనంత‌రం.. ఆయ‌న తాడేప‌ల్లికి చేరుకుం టారు.

ఈ క్ర‌మంలోనే నాగార్జున బృందం సీఎంతో భేటీ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఇటీవ‌లే దిల్ రాజు స‌హా.. ప‌లువురు నిర్మాత‌లు.. కొన్ని రోజుల కింద‌ట‌.. మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆన్ లైన్ టికెట్ల విక్ర‌యాల‌పై వారు చ‌ర్చించారు. అదేస‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. హైద‌రాబాద్‌లో చేసిన వ్యాఖ్య‌ల‌పైనా చ‌ర్చించారు.

ఇప్పుడు ఇదే ప‌నిపై నాగార్జున కూడా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. తాజాగా జ‌రుగుతున్న కేబినెట్ భేటీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్ర‌యానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో దీనిపైనే చ‌ర్చించ‌డానికి నాగార్జున వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు.. త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నాయ‌ని.. నాగార్జున వ్యాఖ్యానించిన నేప‌థ్యంలో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తారా? దానికీ ఇండ‌స్ట్రీకి సంబంధం లేద‌ని.. మ‌రోసారి సీఎంకు వివ‌రిస్తారా? అనే అంశాలు కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ఏం చ‌ర్చిస్తారో.. చూడాలి.