మోడీ ఇరుక్కున్నట్లేనా ?

సుప్రింకోర్టు చర్యతో ప్రధానమంత్రి నరేంద్రమోడిలో టెన్షన్ మొదలైనట్లే. కేంద్రప్రభుత్వ వైఖరితో సంబంధంలేకుండా , మోడీ ఆలోచనలను ఏమాత్రం పట్టించుకోకుండా సుప్రింకోర్టు స్వతంత్రంగా వ్యవహరించింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి ప్రముఖుల మొబైళ్ళను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలపై దర్యాప్తుకు సుప్రింకోర్టు త్రిసభ్య కమిటి వేసింది. దేశ అత్యున్నత న్యాయవ్యవస్ధ స్వతంత్రంగా వ్యవహరించటం కేంద్రప్రభుత్వానికి మింగుడుపడటంలేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉపయోగించి దేశంలోని వందలమంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే అంశం బయటపడటంతో సంచలనమైంది.

దీనిపై జర్నలిస్టులు, జడ్జీలు, శాస్త్రవేత్తల్లో కొందరు సుప్రింకోర్టులో పిటీషన్లు వేశారు. దీంతో విచారణకు స్వీకరించిన సుప్రింకోర్టు కేంద్రప్రభుత్వానికి నోటీసులు ఇఛ్చింది. అయితే విచారణలో కేంద్రప్రభుత్వం పెద్దగా సహకరించలేదు. దీంతో సుప్రింకోర్టు వార్నింగ్ ఇచ్చి విచారణను వాయిదా వేసినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన సుప్రింకోర్టు ఫైనల్ గా త్రిసభ్య కమిటి వేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగంపై దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వటానికి 8 వారాలు మాత్రమే గడువిచ్చింది.

రిటైర్డ్ జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్ వర్క్, హార్డ్ వేర్ లో నిపుణులైన నవీన్ కుమార్ చౌదురి, ప్రభాహరన్, పీ. అశ్విన్, అనీల్ గుమస్తే కమిటి పనిచేస్తుంది. ఐపీఎస్ మాజీ అధికారి అలోక్ జోషి, డాక్టర్ సందీప్ ఒబెరాయ్ కమిటికి సహకరిస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేంద్రప్రభుత్వంతో సంబంధం లేకుండానే సుప్రింకోర్టు స్వతంత్ర కమిటిని వేసింది. అంటే ఇష్టమున్నా లేకపోయినా హోంశాఖ, విదేశీవ్యవహారాల శాఖ, రక్షణశాఖలు కమిటికి సహకరించాల్సిందే.

ఎందుకంటే అనధికారికంగా కేంద్రం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించిందని అర్ధమైపోయింది. అందుకనే ఆ విషయమై కేంద్రం స్పందించటంలేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించిందని సుప్రింకోర్టు కూడా పూర్తిగా నమ్ముతోంది కాబట్టే దర్యాప్తుకు స్వతంత్ర కమిటిని వేసింది. మరి రేపటి నుండి కమిటి దర్యాప్తు మొదలైతే పై శాఖలు ఏ మేరకు సహకరిస్తాయో అనుమానమే. మోడి నేతృత్వంలో పనిచేసే శాఖల మంత్రులు, ఉన్నతాధికారుల ఆమోదం లేకుండా ఎవరు కమిటికి సహకరించరని అందరికీ తెలిసిందే.

ఒకవైపేమో సుప్రింకోర్టు నియమించిన కమిటి దర్యాప్తు, మరోవైపేమో నరేంద్రమోడికి ఏమాత్రం ఇష్టంలేని దర్యాప్తు మధ్యలో మంత్రులు, ఉన్నతాధికారులకు తిప్పలు మొదలైనట్లే. దర్యాప్తుకు సహకరించకపోతే సుప్రింకోర్టు ఊరుకోదు, అలాగని సహకరిస్తే మోడి ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇదే సమయంలో దర్యాప్తుకు కేంద్రం సహకరించటం లేదని కమిటి గనుక సుప్రింకోర్టు దృష్టికి తీసుకెళితే అపుడు మోడి పరిస్ధితి ఏమిటి ? ఇలాంటి అనేక ప్రశ్నలకు తొందరలోనే సమాధానాలు వస్తాయి. చూద్దాం చివరకు ఏమవుతుందో.