అనన్యతో ‘లైగర్‌‌’కి సమస్య లేదు

ఆర్యన్‌ ఖాన్‌తో డ్రగ్స్ గురించి చాట్ చేసినట్టు సాక్ష్యాలు దొరకడంతో అనన్యా పాండే చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. విచారణతో ముగిసిపోతుంది అనుకున్న విషయం కోర్టు వరకు వెళ్లింది. ఆర్యన్‌తో ఆమె చేసిన చాట్‌ను కోర్టు ముందు పెట్టింది ఎన్‌సీబీ. కొకైన్ తీసుకొస్తానని ఆర్యన్ అనడం, తనకు చరాస్ కావాలని అనన్య అడగడం వంటి బలమైన సాక్ష్యాలే ఉన్నాయి ఆ చాట్‌లో. దాంతో ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. అనన్య విషయాన్ని మరింత లోతుగా విచారణ చేయాల్సి ఉందంటున్నారు.

దీంతో ఆమె చేస్తున్న సినిమా షూటింగులకు ఇబ్బంది కలుగుతుందేమోననే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం షకున్ బాత్రా డైరెక్షన్‌లో దీపికా పదుకొనెతో కలిసి ఒక సినిమా చేస్తోంది అనన్య. దాంతో పాటు లైగర్‌‌ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. విజయ్‌ దేవరకొండతో పూరి జగన్నాథ్‌ తీస్తున్న ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్‌ షూటింగ్ ఇప్పటికే కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకి ఇటీవలే మొదలై శరవేగంగా సాగుతోంది. సరిగ్గా ఈ సమయంలో అనన్య కేసులో ఇరుక్కోవడంతో మరోసారి బ్రేక్ తప్పదు అన్నారంతా.

అయితే ఓవైపు కేసు నడుస్తున్నా లైగర్ షూటింగ్‌కి వచ్చిన ఇబ్బంది ఏదీ లేదట. విచారణకు సహకరిస్తూనే షూట్‌లోనూ పాల్గొంటానని పూరి టీమ్‌కి చెప్పిందట అనన్య. ఈరోజు షూటింగ్‌కి కూడా వచ్చేస్తోందట. ఇవాళ్టి నుంచి ఓ సాంగ్ షూట్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. రాయల్ పామ్స్‌ దగ్గర ఉన్న డ్రీమ్‌ స్టూడియోలో ఈ సాంగ్ తీయడానికి ఏర్పాట్లు చేశాడు పూరి. బాబా బాస్కర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటను ఇవాళ, రేపట్లో కంప్లీట్ చేయనున్నారు.

నిజానికి రెండు రోజుల క్రితమే ముంబైలో షూట్ మొదలుపెట్టారు. రొమాంటిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యాక టీమ్ మొత్తం ముంబైలో ల్యాండ్ అయ్యింది. ఆ విషయాన్ని అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ కూడా చేసింది. కానీ అనన్య రాలేకపోవడంతో విజయ్‌కి సంబంధించిన సీన్స్ తీశారట. అనన్య ఈరోజు నుంచి షూట్‌లో జాయినవుతోంది కాబట్టి వీలైనంత త్వరగా ఆమె పోర్షన్‌ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.