తెలంగాణ‌లో కొత్త‌పార్టీ.. వెనుక ఎవ‌రున్నారు?

ఉద్య‌మ నేప‌థ్యం ఉన్న తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతోంది. డాక్టర్ పుంజాల వినయ్ నేతృత్వంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. హైదరాబాద్ బంజారా ఫంక్షన్ హాల్‌లో మద్దతుదారులతో వినయ్ భేటీ అయ్యారు. సాధించుకున్న తెలంగాణలో అందరికీ న్యాయం జరగాలనే డిమాండ్‌తో కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వినయ్ ప్రకటించారు. డాక్టర్ పుంజాల వినయ్ కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ తనయుడు. డిసెంబర్‌లో కొత్త పార్టీ పేరును వినయ్‌కుమార్ ప్రకటించనున్నారు.

తన స్నేహితుడు డాక్టర్ మిత్ర ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చానని విన‌య్‌ తెలిపారు. రాజకీయవేత్తలకు గుర్తు చూసి ఓటేసే వాళ్లు కావాలన్నారు. ఓటింగ్‌లో గుర్తులను కూడా ఓటర్లు గుర్తుపట్టలేని స్థితికి ప్రజలను తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. చదువుకున్నప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థిని చూసి ప్రజలు ఓటేస్తారని, అందుకే ప్రభుత్వాలు విద్యకు ఖర్చుపెట్టడం లేదని, విద్యావ్యవస్థను నీరు గారుస్తున్నారని వినయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్ర‌జ‌ల‌కు విద్యా వ్య‌వ‌స్థ చేరువైన నాడు మాత్ర‌మే దేశంలో ప‌రిణితితో కూడిన రాజ‌కీయాలు వ‌స్తాయ‌న్నారు.

మొత్తానికి రాష్ట్రంలో మ‌రో కొత్త పార్టీ అయితే.. పురుడు పోసుకుంటోంది. ఇప్ప‌టికే ష‌ర్మిల నేతృత్వంలో వైఎ స్సార్ తెలంగాణ పార్టీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు విన‌య్ కొత్త పార్టీ పెట్ట‌నున్నారు. గ‌తంలో శివ‌శంక‌ర్‌కు ఉన్న ప‌లుకుబ‌డి.. మేధావి వ‌ర్గాల్లో ఉన్న ఫాలోయింగ్ వంటివి విన‌య్‌కు ఆశ‌లురేకెత్తిస్తున్న‌ట్టు ఉన్నాయ‌ని తెలుస్తోంది. అయితే.. విన‌య్ వ్య‌వ‌హారం చూస్తే.. గ‌తంలో లోక్‌స‌త్తా కూడా ఇలానే పుట్టుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఉద్య‌మంగా ఉన్న దానిని రాజ‌కీయ పార్టీగా మార్చ‌డం..త ర్వాత‌.. తిరిగి.. తెర‌మ‌రుగు అవ‌డం తెలిసిందే.

ఇప్పుడు చాన్నాళ్ల‌కు మ‌ళ్లీ లోక్‌స‌త్తాను మ‌రిపించేలా.. వ్యాఖ్య‌లు వినిపించాయి. మ‌రి విన‌య్ పార్టీ ఏంటో, దీనివెనుక నిజంగా ఎవ‌రున్నారో.. ఏం చేస్తారో..? అనే వివ‌రాలు తెలియాలంటే.. కొంత వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా.. ఇప్ప‌టికే తామ‌ర తంప‌ర‌లా.. పార్టీలు పుట్టుకురావ‌డం గ‌మ‌నార్హం.