షూటింగ్ ఎగ్గొట్టి డబ్బు డిమాండ్ చేస్తుంది.. తమన్నాపై ఆరోపణలు!

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన ‘మాస్టర్ చెఫ్’ షో ఇప్పుడు సౌత్ ఇండియాకు వచ్చేసింది. దాదాపు అన్ని భాషల్లో ఈ షోను మొదలుపెట్టారు. తెలుగులో ఈ షోకి హోస్ట్ గా తమన్నాను ఎంపిక చేసుకున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ షోని ప్రసారం చేస్తున్నారు.

అయితే రీసెంట్ గానే ఈ షో నుంచి తమన్నాను తొలగించి మరో పాపులర్ యాంకర్ అనసూయను తీసుకున్నారు. తమన్నా బిజీగా ఉండడంతో ఆమె ఈ షో నుంచి తప్పుకుందేమోనని అందరూ అనుకున్నారు.

కానీ ఈ షో నుంచి తనను కావాలనే తప్పించారంటూ తమన్నా షో నిర్వాహకులకు నోటీసులు పంపించింది. తనను కనీసం సంప్రదించకుండా.. కమ్యూనికేషన్ కట్ చేసి అన్ ప్రొఫెషనల్ గా బిహేవ్ చేశారంటూ తమన్నా తన పిటిషన్ లో పేర్కొంది. దీనికి స్పందించిన నిర్వాహకులు కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తమన్నాను హోస్ట్ గా ఎన్నుకున్నప్పుడు రూ.2 కోట్ల రెమ్యునరేషన్ కి అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు.

జూన్ 24 నుంచి సెప్టెంబర్ నెల చివరి వరకు మధ్యలో మొత్తం 18 రోజుల పాటు షోకి హోస్ట్ గా వ్యవహరించడానికి ఆమె సైన్ చేసినట్లు చెప్పారు. కానీ ఆమెకున్న కమిట్మెంట్స్ కారణంగా 18 రోజుల్లో 16 రోజులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యారని.. రెండు రోజులు షూటింగ్ కి రాలేదని అన్నారు. అప్పటికే రూ.1.56 కోట్లు పేమెంట్ ఇచ్చేశామని తెలిపారు.

ఆమె రెండు రోజులపాటు షూటింగ్ కి హాజరు కాకపోవడంతో దాదాపు మూడు వందల మంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తోన్న ప్రొడక్షన్ హౌస్ కి రూ.5 కోట్లకు పైగా నష్టం వచ్చిందని తెలిపారు. అగ్రిమెంట్ చేసుకున్నప్రకారం ఆమె మొత్తం షూటింగ్ పూర్తి చేసి ఉంటే మిగిలిన రూ.50 లక్షల పేమెంట్ కూడా ఇచ్చేవాళ్లమని చెప్పుకొచ్చారు. షూటింగ్ పూర్తి చేయకుండా.. రెండో సీజన్ కి అడ్వాన్స్ కావాలని డిమాండ్ చేస్తున్నారని.. అసలు సెకండ్ సీజన్ కి ఆమెని హోస్ట్ గా అనుకోలేదని చెప్పుకొచ్చారు.