బాబుకు జ్ఞానోదయం.. మళ్లీ మళ్లీ కుప్పం టూర్ !

తెలుగు దేశం అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి ఇప్ప‌టికీ జ్ఞానోదయమైందా? ఇన్ని రోజులుగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పాన్ని ప‌ట్టించుకోని ఆయ‌న ఇప్పుడు దానిపై ప్ర‌త్యేక దృష్టి సారించారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కుప్పంలో టీడీపీని దెబ్బ కొట్టిన వైసీపీ మంచి ఫ‌లితాలు సాధించింది. దీంతో బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే టీడీపీకి దెబ్బ ప‌డింది. మ‌రోవైపు వైసీపీ కూడా అక్క‌డ ప‌ట్టు సాధించ‌డం కోసం అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది.

బాబులో కుప్పం క‌ల‌వ‌రం మొద‌లైంది. త్వ‌ర‌లో జ‌రిగే కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌నేది ఆయ‌న ఉద్దేశ్యంగా క‌నిపిస్తోంది. త‌న‌కు కంచుకోట‌గా ఉన్న కుప్పం గురించి మూడు ద‌శాబ్దాలుగా బాబు అస‌లు ఆలోచించ‌లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్న లేకున్నా.. కుప్పం ప్ర‌జ‌లు త‌న మాట వింటార‌ని బాబుకు న‌మ్మ‌కం ఉండేది. కానీ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని చిత్తుచేసి జ‌గ‌న్ తొలిసారి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి కుప్పంలో ప‌రిస్థితుల్లో మార్పులు వ‌చ్చింది. కుప్పంలో వైసీపీ ఆధిప‌త్యం కోసం ప్రయ‌త్నించ‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌జ‌లు కూడా వైసీపీ వైపు మ‌ళ్లుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అక్క‌డి టీడీపీ నాయకుల్లో అసంతృప్తి పెరిగిపోతుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీంతో కుప్పంపై బాబు ప్ర‌త్యేక దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఏకంగా నాలుగు రోజుల పాటు బాబు కుప్పం నియోజ‌కవ‌ర్గంలో ప‌ర్య‌టించ‌నున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బాబు ప‌ర్య‌ట‌న ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీ నేత‌లు కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న స‌మావేశం కానున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. ఈ మేర‌కు బాబు ముందుగానే స్థానిక నాయ‌కుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు తెలిసింది. మ‌రోవైపు త‌న కుప్పం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు క‌నిపించ‌కూడ‌ద‌ని బాబు క‌రాఖండిగా చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా కుప్పాన్ని బాబుకు దూరం చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అక్క‌డి మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో పార్టీని గెలిపించే బాధ్య‌త‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కుమారుడు మిధున్ రెడ్డికి అప్ప‌గించారు. ప్ర‌స్తుతం బ‌ద్వేలు ఉప ఎన్నిక బాధ్య‌త‌ల్లో పెద్దిరెడ్డి బిజీగా ఉన్నారు. అందుకే ఆయ‌న కొడుక్కి జ‌గ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌జెప్పారు. మిధున్ కూడా ఆ దిశ‌గా ఇప్పటికే రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.