షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు

వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రకు ఊహించిన అతిథులు వస్తున్నారు. వారు చుట్టం చూపు వచ్చిపోవడం లేదు. పాదయాత్ర తీరుతెన్నులను ప్రజల్లో వస్తున్న ఆధరణను గమనిస్తున్నారు. పాదయాత్రపై ఆరా తీసిస్తున్నారు. ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, షర్మిలను కలిసి వెళ్లారు. సోమవారం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. వీరిద్దరూ సీఎం జగన్‌కు షర్మిలకు అత్యంత సన్నిహితులు.

రెండు రోజుల వ్యవధిలో సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి పాదయాత్రలో ఉన్న షర్మిలతో భేటీ కావడం అటు ఏపీలో ఇటు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. వీరి రాకపై అనేక చర్చలు సాగుతున్నాయి. ఈ నేతలు ఊరికే వస్తున్నారా? లేక ఏమైనా రాయబారం నడుపుతున్నారా? జగన్ ఏదైనా సందేశాన్ని ఇచ్చి పంపుతున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జగన్ దూతలుగా వస్తే నిన్ననే సుబ్బారెడ్డి వచ్చి వెళ్లారా కదా.. 24 గంటలు గడవకముందే రామకృష్ణారెడ్డి ఎందుకు వచ్చారు.. వీరి రాకకు కారణాలు ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు.

కందుకూరు మండలంలో జరిగిన షర్మిల పాదయాత్రలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. కందుకూరు మండలం లేమూరులో పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మాట- ముచ్చట కార్యక్రమంలో ఆళ్ల పాల్గొన్నారు. అయితే ఆయన వేదిక పంచుకోకుండా ప్రజల మధ్యలో కూర్చొని షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మాట-ముచ్చట కార్యక్రమం జరిగే ప్రాంతంలో ఒక ఇంటి మెట్లపై జనం మధ్యే కుర్చోని ఆసక్తిగా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం పాదయాత్రలో అందరితో కలిసి నడిచారు.

సోమవారం రాత్రి ఆర్మియాగూడలో క్యాంప్‌ వద్ద షర్మిలతో గంటపాటు భేటీ అయ్యారు. ఆదివారం వైవీ సుబ్బారెడ్డి, మహేశ్వరంలో షర్మిలతో సుమారు గంటపాటు భేటీ అయ్యారు. షర్మిలతో వైసీపీ నేతల వరుస భేటీలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. షర్మిల పార్టీ పెట్టేందుకు సన్నహాకాలు చేస్తున్న సమయంలో కూడా షర్మిలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. లోటస్ పాండ్‌లో షర్మిలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆమెతో కేవలం 10 నిమిషాలు మాత్రమే భేటీ అయ్యారు. అయితే అనిల్‌కుమార్‌తో ఏకాంతంగా దాదాపు గంటపాటు మంతనాలు జరిపారు. షర్మిల పార్టీ ఏర్పాటు చేయకముందు.. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రామకృష్ణారెడ్డి భేటీ కావడం ప్రధాన్యత సంతరించుకుంది.

చేవెళ్ల నుంచి చేపట్టిన పాదయాత్ర సోమవారం ఆరో రోజు మహేశ్వరం నుంచి తుమ్మలూరు, మీదుగా కందుకూరు మండలం రాచులూరుగేటు, లేమూరు మీదుగా తిమ్మాపురం శివారు వరకు 14.6 కిలో మీటర్లు కొనసాగింది. లేమూరులో జరిగిన మాటా-ముచ్చట కార్యక్రమంలో ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తాను తెలంగాణ ఆడ బిడ్డనని చెప్పారు. ఇక్కడే చదువుకున్నానని, తాను తెలంగాణ వ్యక్తిని వివాహం చేసుకున్నానని గుర్తుచేశారు.

1,200మంది విద్యార్థులు, యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారని తెలిపారు. నీళ్లు, నిధులు నియామకాల కోసం ఉద్యమం జరిగితే ఫలితాలను మాత్రం కేసీఆర్‌ కుటుంబం అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతోనే ప్రజల ముందుక వచ్చానని స్పష్టం చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వంటి సంక్షేమ పాలన, పథకాలు తిరిగి తెచ్చుకోవాలంటే వైఎస్ఆర్‌టీపీ ఆశీర్వదించాలని షర్మిల ప్రజలను కోరారు. మహేశ్వరం టీఆర్ఎస్‌ బహిష్కృత నేత మోహన్‌రెడ్డి షర్మిల సమక్షంలో వైఎస్ఆర్‌టీపీ చేరారు. మహేశ్వరం మండలం సిగిరిపురం గ్రామానికి చెందిన టీఆర్ఎస్‌ బహిష్కృత నేత ఎడ్మ మోహన్‌రెడ్డి సోమవారం వైస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు.