సుకుమార్‌కు ఆ హ్యాంగోవర్ వదల్లేదా?

ఒక దర్శకుడు తన మీద అంచనాలను మించిపోయి ఒక క్లాసిక్ టచ్ ఉన్న బ్లాక్‌బస్టర్ తీసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాక ఆ సినిమా తాలూకు హ్యాంగోవర్‌లో ఉండిపోవడం మామూలే. సుకుమార్ సైతం ఇందుకు మినహాయింపు కాదనే అనిపిస్తోంది. ‘రంగస్థలం’తో సుక్కు ఎంత భారీ విజయాన్నందుకున్నారో తెలిసిందే. ఆ సినిమాలో సుకుమార్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. చూడగా చూడగా జనాలకు ‘రంగస్థలం’ మరింత నచ్చేసి దానికి ‘మాస్టర్ పీస్’ స్టేటస్ ఇచ్చేశారు.

గ్రామీణ నేపథ్యంలో ఒక రస్టిక్ మూవీ తీస్తే జనాలకు ఇంతగా నచ్చేసేసరికి సుకుమార్ తన తర్వాతి చిత్రానికి కూడా అదే రూట్ ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. సుక్కు నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘పుష్స’ నుంచి ఏ ప్రోమో రిలీజైనా ‘రంగస్థలం’ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు జనం. హీరో అల్లు అర్జున్ లుక్ చూసినా.. హీరోయిన్ రష్మికను చూసినా జనాలకు ఆటోమేటిగ్గా ‘రంగస్థలం’ గుర్తుకొస్తోంది.

‘పుష్ప’ నుంచి వస్తున్న ఒక్కో పాటను చూస్తున్నా, వింటున్నా కూడా ‘రంగస్థలం’ ఛాయలే కనిపిస్తున్నాయి. దాక్కో దాక్కో మేక పాట ‘రంగస్థలం’ టైటిల్ సాంగ్‌ను గుర్తుకు తెస్తే.. ‘శ్రీవల్లి’ పాటేమో ‘ఎంత సక్కగున్నావో’ తరహాలో సాగింది. పాట విన్నా.. విజువల్స్ చూస్తున్నా అదే ఫీల్స్ కలిగాయి. ఇప్పుడు ‘పుష్ప’ నుంచి మూడో సింగిల్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. నా సామీ.. అంటూ సాగే ఈ పాట ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. అది ‘రంగస్థలం’లోని ‘రంగమ్మా మంగమ్మా’ పాటను గుర్తుకు తెస్తోంది.

హీరో మీద ఒక అలకతో కూడిన ప్రేమను చూపించే తరహాలో హీరోయిన్ కోణంలో సాగే పాట ఇదని ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఏ పాటకు ఆ పాట బాగానే అనిపిస్తున్నా.. మరీ ప్రతి విషయంలోనూ ‘రంగస్థలం’ను అనుసరిస్తున్నట్లు, అనుకరిస్తున్నట్లు కనిపిస్తుండటమే కొంచెం విడ్డూరంగా తోస్తోంది. సుకుమార్ ‘రంగస్థలం’ హ్యాంగోవర్ నుంచి బయటికి రాలేకపోతున్నారని.. సినిమాను కూడా అదే తరహాలో మలిచి ఉంటాడని.. మరి ‘రంగస్థలం’ కొత్త అనుభూతిని పంచకుండా దానికి అనుకరణ లాగా అనిపిస్తే సినిమా పట్ల ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.