నిజ‌మా.. బన్సాలీతో తార‌క్?

బాహుబ‌లి మూవీతో ప్ర‌భాస్ ఇండియాలోనే అతి పెద్ద స్టార్‌గా అవ‌త‌రించాడు. అత‌ను వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పేరున్న బాలీవుడ్ ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు అత‌డితో సినిమాలు చేసేందుకు వ‌రుస క‌డుతున్నారు. ఇప్ప‌టికే తానాజి ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిపురుష్ తీస్తున్నాడు.

సిద్దార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ప్ర‌భాస్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి. కాగా బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి తీస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని.. ఈ చిత్ర హీరోలు జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ సైతం పాన్ ఇండియా స్టార్లు అవుతార‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో వీళ్లిద్ద‌రూ కూడా బాలీవుడ్ ద‌ర్శ‌కుల‌తో పాన్ ఇండియా సినిమాలు చేసే అవ‌కాశాల‌ను కొట్టిపారేయ‌లేం.

ఇందుకోసం ఆర్ఆర్ఆర్ రిలీజయ్యా కొన్నాళ్ల వ‌ర‌కు ఎదురు చూడాల్సి ఉంటుంద‌ని అంచనా వేస్తున్నారు. కానీ ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ప్ర‌ముఖ బాలీవుడ్ ఫిలిం మేక‌ర్ సంజ‌య్ లీలా బ‌న్సాలీ.. మ‌న జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్న‌ట్లుగా వార్త‌లొస్తున్నాయి. భారీత‌నం ఉన్న‌ పీరియ‌డ్ సినిమాలు తీయ‌డంలో సిద్ధ‌హ‌స్తుడైన బ‌న్సాలీ తార‌క్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుంద‌న్న ఊహే ఎగ్జైట్ చేసేదే. ఆదివారం ట్విట్ట‌ర్లో దీని గురించి జోరుగా ఊహాగానాలు న‌డుస్తున్నాయి.

తార‌క్‌తో బ‌న్సాలీ వీడియో కాల్ కూడా మాట్లాడాడ‌ని.. వీళ్లిద్ద‌రి మ‌ధ్య చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న సినిమా వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని.. ఆటోమేటిగ్గా అది పాన్ ఇండియా లెవెల్లోనే ఉంటుంద‌ని అంటున్నారు. ఐతే ఈ ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో ఏమో.. తార‌క్-బ‌న్సాలీ క‌ల‌యిక‌లో సినిమా వ‌స్తే మాత్రం అదొక సెన్సేష‌న్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.