పూజా.. ఎంత ఎదిగిపోయిందబ్బా

హీరోయిన్లు ఎన్ని హిట్లు కొట్టినా.. ఎంత స్థాయికి ఎదిగినా వాళ్లకు ఫిలిం ఇండస్ట్రీలో దక్కాల్సినంత ప్రాధాన్యం, గౌరవం దక్కదనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. బేసిగ్గా సినీ పరిశ్రమల్లో పురుషాధిక్యం గురించి తెలిసిందే. అందులోనూ టాలీవుడ్లో ఇది మరీ ఎక్కువ అనడానికి చాలా రుజువులు కనిపిస్తాయి . సినిమా సక్సెస్‌లో హీరోయిన్ల క్రెడిట్‌కు దక్కడం చాలా తక్కువ. సినిమాల విజయోత్సవాల్లోనూ వాళ్లకిచ్చే ప్రయారిటీ తక్కువగానే కనిపిస్తుంది. ఒక హీరో కాస్త ఇమేజ్ వచ్చిందంటే వాళ్లకు ఇండస్ట్రీలో దక్కే గౌరవమే వేరుగా ఉంటుంది.

ఐతే హీరోయిన్ ఎన్ని విజయాలందుకున్నప్పటికీ.. వాళ్లకో ఇమేజ్ ఉన్నట్లు, స్థాయి ఉన్నట్లు గుర్తించడం తక్కువే. టాలీవుడ్ విషయానికి వస్తే.. అనుష్క, సమంత లాంటి కొంతమంది మాత్రమే ఇలాంటి గౌరవాన్ని అందుకున్నారు. ఇలాంటి కొంతమందికి మాత్రమే మరో సినిమాకు చీఫ్ గెస్ట్ అయ్యే అవకాశం దక్కింది.

హీరోయిన్లు ఎప్పుడూ అతిథుల్లో ఒక్కరవుతుంటారు కానీ.. వాళ్లే ముఖ్య అతిథి కావడం చాలా అరుదు. ఇప్పుడు పూజా హెగ్డే ఇలాంటి అరుదైన అవకాశాన్నే దక్కించుకుంది. సితార ఎంటర్టైన్మెంట్స్‌లో తెరకెక్కిన ‘వరుడు కావలెను’ మూవీ సంగీత్ ఈవెంట్‌కు పూజానే ముఖ్య అతిథిగా హాజరైంది. దీని పట్ల ఆమె ఎంత ఎగ్జైట్ అయిందనేది తన ప్రసంగంలో బాగానే కనిపించింది. ఒక సినిమా ఈవెంట్‌కు ఓ కథానాయిక చీఫ్ గెస్ట్‌గా రావడం అంటే ఎంత కష్టమో తనకు తెలుసని, ఇది తనకు దక్కిన గౌరవం అని ఆమె వ్యాఖ్యానించింది. ఇందుకు ‘వరుడు కావలెను’ నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది.

రీతూ వర్మ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ పూజాను కొనియాడింది. మిగతా వాళ్లు కూడా పూజాను ఒక రేంజిలో పొగిడారు. గత కొన్నేళ్లలో టాలీవుడ్లో పూజా ఎంత వేగంగా ఎదిగిందో తెలిసిందే. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో.. ఇలాంటి భారీ విజయాలతో ఆమె తిరుగులేని స్థాయిని అందుకుంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ హిట్టయిందంటే అందులో మేజర్ క్రెడిట్ పూజదే. ఈ విషయాన్ని గుర్తించే పూజాను ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా పిలిచి ఆమెను గౌరవించింది ‘వరుడు కావలెను’ టీం.