‘మాస్టర్ చెఫ్’ షోపై తమన్నా లీగల్ యాక్షన్!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఈ మధ్యకాలంలో తన జోరు మరింత పెంచింది. సినిమాలు, వెబ్ సిరీస్ లంటూ చాలా బిజీగా గడుపుతోంది. అదే సమయంలో ఆమెకి ‘మాస్టర్ చెఫ్’ అనే కుకింగ్ షోకి హోస్ట్ గా వ్యవహరించే అవకాశం రావడంతో ఆమె వెంటనే అంగీకరించింది. పర్సనల్ గా తమన్నాకు ఈ షోపై ఇంట్రెస్ట్ ఉండడం, తన టీవీ డెబ్యూకి అదే షోని హోస్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆమె ఎగ్జైట్ అయింది. తన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఈ షో కోసం డేట్స్ ను కేటాయించింది.

అయితే ఇప్పుడు సడెన్ గా ఆమెని తప్పించి అనసూయను రంగంలోకి దించారు. తమన్నా బిజీగా ఉండడం వలన అనసూయను తీసుకొని ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ తమన్నాను తప్పించి అనసూయను తీసుకున్నారనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై తమన్నా లీగల్ ప్రొసీడ్ అవుదామని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ షో కోసం తమన్నా వేరే కమిట్మెంట్ ను కాదనుకుందట. తీరా చూస్తే ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు తనకు చెప్పిన పేమెంట్ ఇవ్వకపోవడం, అన్ ప్రొఫెషనల్ గా ప్రవర్తించడంతో లీగల్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకుంది.

తమన్నా తరఫు న్యాయవాది ఓ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని వెల్లడించారు. ‘మాస్టర్ చెఫ్’ ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిలిం అకాడమీ.. తమన్నాకు పేమెంట్ ఎగ్గొట్టమే కాకుండా.. ఆమెతో కమ్యునినేషన్ కూడా కట్ చేశారని.. దీంతో ఆమె లీగల్ గా ప్రొసీడ్ అవ్వడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయిందని తమన్నా లాయర్ తెలిపారు. మరి దీనిపై ‘మాస్టర్ చెఫ్’ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి!