కాజల్‌కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్

తండ్రీ కొడుకులైన హీరోలు ఇద్దరికీ జోడీగా నటించిన కథానాయికలు అరుదుగా ఉంటారు. ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పక్కన కథానాయికగా నటించిన శ్రీదేవి.. ఆ తర్వాత నాగార్జునకూ జోడీగా నటించిన సంగతి తెలిసిందే. ఐతే ఒకప్పుడు ఈ సాహసం చేశారు కానీ.. తర్వాతి కాలంలో ఇలాంటి ప్రయత్నాలు ఎవ్వరూ చేయలేదు. కొత్త తరం ప్రేక్షకులు ఇలాంటి విషయాల్ని జీర్ణించుకోలేరనో ఏమో.. ఫిలిం మేకర్స్ ఆ దిశగా ఆలోచించలేదు.

ఐతే గత కొన్నేళ్లలో సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత వచ్చేయడంతో పాత ట్రెండ్ తిరిగి తీసుకురాక తప్పలేదు. రామ్ చరణ్ సరసన మూడు చిత్రాల్లో కథానాయికగా నటించిన కాజల్ అగర్వాల్‌ను ‘ఖైదీ నంబర్ 150’లో చిరంజీవికి హీరోయిన్‌గా ఎంచుకున్నారు. తమన్నా సైతం ముందు చరణ్‌తో జోడీ కట్టి.. ఆ తర్వాత చిరుకు హీరోయిన్ అయింది.

మరో సీనియర్ హీరో నాగార్జున విషయంలో దీనికి రివర్స్‌గా జరిగింది. ఆయనతో ‘సోగ్గాడే చిన్నినాయనా’లో కథానాయికగా నటించిన లావణ్య త్రిపాఠి.. నాగచైతన్యతో ‘యుద్ధం శరణం’లో హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత కాజల్ కూడా ఈ ఫీట్‌ను రిపీట్ చేయడానికి రెడీ అయింది. ‘దడ’లో చైతూతో జోడీ కట్టిన ఆమె.. నాగ్ కొత్త చిత్రం ‘ఘోస్ట్’కు హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాను ఆమె పూర్తి చేస్తే అటు చిరు-చరణ్, ఇటు నాగ్-చైతూలతో కలిసి నటించిన అరుదైన కథానాయిక అయ్యేది. కానీ ఈ సినిమా నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె తప్పుకుంది. ఇందుక్కారణం ఆమె గర్భవతి కావడమే అంటున్నారు. అదెంత వరకు నిజమో కానీ.. కాజల్ ఈ చిత్రంలో నటించట్లేదన్నది మాత్రం వాస్తవం.

ఆమె స్థానంలోకి అమలాపాల్‌ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశేషం ఏంటంటే.. కాజల్ లాగే ఆమె కూడా ఇంతకుముందే చైతూకు జోడీగా నటించింది. వీళ్లిద్దరూ కలిసి ‘బెజవాడ’ సినిమాలో నటించారు. నాగ్‌కు జోడీగా అమలా ఫిక్స్ అయినట్లయితే ఈ రకంగా కాజల్‌కు ఆమె పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అనుకోవచ్చు.