మెగాస్టార్ ప్లాన్ మారిందా!

రీఎంట్రీ తర్వాత ఆచితూచి అప్పుడో సినిమా ఇప్పుడో సినిమా చేస్తారేమో అనుకున్నవారికి.. వరుస కమిట్‌మెంట్స్‌తో తన జోష్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు చిరంజీవి. ఆరుపదుల వయసులోనూ డ్యాన్సులు, ఫైట్ల విషయంలో యంగ్‌ హీరోలను మించి పర్‌‌ఫార్మ్ చేస్తున్న చిరు.. త్వరలో ‘ఆచార్య’గా కనువిందు చేయబోతున్నారు. ఆ తర్వాత గాడ్‌ ఫాదర్, భోళాశంకర్, బాబి డైరెక్షన్‌లో సినిమా క్యూలో ఉన్నాయి. అయితే ఈ లైనప్‌ కాస్త మారుతున్నట్టు తెలుస్తోంది.

‘గాడ్‌ఫాదర్‌‌’ మూవీ షూటింగ్ ఆల్రెడీ శరవేగంగా జరుగుతోంది. ‘భోళాశంకర్’ మ్యూజిక్‌ వర్క్ కూడా జోరుగానే సాగుతోంది. ఈ రెండూ పూర్తయ్యాక బాబి సినిమాని సెట్స్‌కి తీసుకెళ్లాలి అనుకున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ ప్లాన్‌లో చేంజ్ వచ్చిందట. ‘భోళాశంకర్‌‌’కి బ్రేక్‌ ఇచ్చి, బాబి సినిమాని పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.

దీనికి కారణం ఉంది. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ‘గాడ్‌ఫాదర్’ మలయాళ మూవీ ‘లూసిఫర్‌‌’కి రీమేక్. ‘భోళాశంకర్‌‌’ చిత్రం అజిత్‌ ‘వేదాళం’కి రీమేక్. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్‌ చేయడం కంటే మధ్యలో ఒక స్ట్రెయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తే బెటరని చిరు ఫీలవుతున్నారట. అందుకే ‘భోళాశంకర్‌‌’ను కొన్ని రోజులు ఆపి, బాబి సినిమా మొదలుపెడితే మంచిదని నిర్ణయించుకున్నారట. సినిమా స్టార్ట్ చేయడానికి దీపావళికి ముహూర్తం పెట్టారని కూడా అంటున్నారు.

నిజానికి ఇది మంచి ఆలోచనే. చిరంజీవి లాంటి టాప్ హీరో కోరుకుంటే కథలు క్యూ కడతాయి, మరి రీమేక్స్ చేయడమేంటి అనే చర్చ ఇప్పటికే ఇండస్ట్రీలో నడుస్తోంది. పైగా డబ్బింగ్ వెర్షన్‌ ద్వారా తెలుగు ప్రేక్షకులు ఆల్రెడీ చూసేసిన సినిమాలు మళ్లీ రీమేక్ చేయడమెందుకు అనే ప్రశ్నకి కూడా ఇంతవరకు జవాబు దొరకలేదు. ఎంత మన నేటివిటీకి మార్చినా మెయిన్‌ పాయింట్ అందరికీ తెలిసిందే కాబట్టి రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేం. అలాంటప్పుడు వెంటవెంటనే రీమేక్స్‌తో రావడం కాస్త రిస్కే. కాబట్టి మెగాస్టార్ తన ప్లాన్ మార్చడం మంచిదే.