కాశ్మీర్ లోయ: రూటు మార్చిన తీవ్రవాదులు

అవును భూతల స్వర్గంగా పేరున్న జమ్మూ-కాశ్మీర్ లో తీవ్రవాదులు రూటు మార్చారు. మొన్నటి వరకు సైనికులు, సైనిక పోస్టులే టార్గెట్ గా కాల్పులు జరపడం, బాంబు దాడులు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి దాడుల వల్ల సైనికులు, స్థానికులు వెంటనే అప్రమత్తమవైపోతున్నారు. దాంతో తీవ్రవాదులు కూడా సైన్యం నుంచి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సొస్తోంది. ఫలితంగా తీవ్రవాదులు కూడా చనిపోతున్నారు. అందుకనే తమ రూటు మార్చుకోవాలని తీవ్రవాదులు డిసైడ్ అయ్యారు.

ఇంతకీ మార్చిన కొత్త రూటు ఏమిటంటే చిన్న చిన్న టార్గెట్లు. అందులోను సైనికులు, పోలీసులు కాకుండా మామూలు జనాలనే టార్గెట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో కూడా కాశ్మీర్ పండిట్లనే ప్రధాన టార్గెట్లుగా తీవ్రవాదులు ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవేళ కాశ్మీర్ పండిట్లు దొరక్కపోతే అందుబాటులో ఎవరుంటే వాళ్ళని కాల్చి చంపటమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వారం రోజుల్లో 11 మంది మామూలు జనాలను తీవ్రవాదులు చంపేశారు.

ఓ చిన్న తుపాకీని తీసుకోవటం ఓ స్కూలుకో, మార్కెట్ కో లేకపోతే ప్లే గ్రౌండ్ కో వెళ్ళటం ఇవేవీ కుదరకపోతే ఒంటరిగా దొరికిన వాళ్ళను దగ్గరకు వెళ్ళి కాల్చేసి తీవ్రవాదులు వెళ్ళిపోతున్నారు. ఇళ్ళల్లో ఒంటరిగా ఉంటున్న వాళ్ళని కూడా కాల్చి చంపేస్తున్నారు. తీవ్రవాదుల తాజా వ్యూహం బయటపడటంతో మామూలు జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తమ ప్రాంతంలో ఏ కొత్త వ్యక్తులను చూసినా, ఆఫీసుల్లో, స్కూళ్లలో కొత్తగా ఎవరిని చూసినా జనాలు తీవ్రవాదులే అని అనుమానిస్తున్నారు.

ఇప్పటి వాతావరణం ఎలాగుందంటే 1990ల నాటి వాతావరణం లాగుంది. ఎందుకంటే అప్పట్లో కూడా తీవ్రవాదులు మామూలు జనాలను ప్రత్యేకించి కాశ్మీరీ పండిట్ల నే టార్గెట్లుగా చేసుకుని చంపేశారు. తీవ్రవాదుల దెబ్బకు కాశ్మీరీ పండిట్లు తమ ఆస్తులు, ఇండ్లను కూడా వదిలేసి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. కాశ్మీర్ నుండి వెళ్లిపోగా మిగిలిన పండిట్లలో కొందరిని తీవ్రవాదులు వెతికి వెతికి మరీ చంపిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ లోయలో తీవ్రవాదం బాగా తగ్గిపోయిందని కేంద్రం చెప్పుకుంటున్నదంతా తప్పని తేలిపోయింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్న పాకిస్ధాన్+పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు జమ్మూ-కాశ్మీర్ లో పెద్దఎత్తున మారణకాండకు పాల్పడుతున్నారు. తీవ్రవాదులు మొదలుపెట్టిన కొత్త పద్దతిని ఎలా కంట్రోల్ చేయాలో తెలీక మిలిటరీ, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరి ఈ మారణకాండ ఎప్పటికి ముగుస్తుందో ఏమో.