యూట్యూబ్‌ చానెళ్లపై సమంత పరువు నష్టం దావా

సెలెబ్రిటీల లైఫ్‌పై అందరికీ ఆసక్తే. కాబట్టే ఏ చిన్న వార్త వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త అసత్యమైతే వారికెంత బాధ కలుగుతుందో తనలాంటి వాళ్లకే తెలుస్తుంది అంటోంది సమంత. తప్పుడు వార్తలు ప్రచారం చేసి తననలా బాధపెట్టిన మూడు యూట్యూబ్ చానెళ్లపై పరువు నష్టం దావా వేసిందామె.

సమంత, నాగచైతన్యల విడాకుల ప్రకటన వచ్చినప్పటి నుంచి మీడియాలో ఎన్ని రకాల వార్తలు వచ్చాయో తెలిసిందే. ముఖ్యంగా డివోర్స్‌కి సమంత ప్రవర్తనే కారణమంటూ బాగా ప్రచారం జరిగింది. ఆమెకి అబార్షన్స్ అయ్యాయని, పిల్లలు కనడానికి ఇష్టపడటం లేదని, ప్రీతమ్ జుకల్కర్‌‌తో ఆమెకున్న అనుబంధమే విడాకులకు కారణమని.. ఇలా చాలా వార్తలొచ్చాయి. అవన్నీ నిజం కాదని ఓ నోట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చిన సమంత, ఇప్పుడు కుకట్‌పల్లి కోర్టులో మూడు యూట్యూబ్ చానెళ్ల మీద పరువు నష్టం దావా వేసింది.

తనపై సోషల్ మీడియాలో దారుణంగా దుష్ప్రచారం చేశారని, తప్పుడు వార్తలతో తన పరువుకు నష్టం కలిగించారని పిటిషన్‌లో పేర్కొంది సామ్. ఆమె తరఫున హైకోర్ట్ లాయర్ బాలాజీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసి వాదనలు వినిపించారు. మరి ఇప్పటికైనా అసత్య వార్తలకు ఫుల్‌స్టాప్ పడి సమంతకి ఊరట దొరుకుతుందో లేదో.