36 గంట‌ల పాటు చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. ఆయ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఏకంగా 36 గంట‌ల పాటు చంద్ర‌బాబు దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. నిజానికి ఇలాంటి దీక్ష‌, ఇంత‌సేపు చేయ‌డం.. చంద్ర‌బాబు రాజకీయ జీవితంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు దాడుల‌కు దిగారు. ఈ క్ర‌మంలో కార్యాల‌యాన్ని ధ్వంసం చేశార‌నేది టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌.

ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌ల‌ దాడుల‌కు నిర‌స‌న‌గా.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే.. అధికార పార్టీ నుంచి ఎలాంటి స‌ర్దుబాటు ధోర‌ణి క‌నిపించ‌క‌పోగా.. ఈ ప‌రిస్థితిని ఇలానే వ‌దిలేస్తే.. బాగుండ‌ద‌ని.. అనుకున్నారో.. ఏమో.. చంద్ర‌బాబు 36 గంట‌ల దీక్ష‌కు రెడీ అయ్యారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల వ‌రకు నిర‌స‌న దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబందించిన ప్లాన్‌ను ఆయ‌న మీడియాకు విడుద‌ల చేశారు.

పార్టీ కార్యాల‌యంలోనే ఎన్టీఆర్ విగ్ర‌హం వద్దే కూర్చుని దీక్ష చేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. ఎక్క‌డైతే.. అద్దాలు ప‌గిలాయో.. ఎక్క‌డైతే.. పార్టీ కార్యాల‌యం ధ్వంస‌మైందో.. అక్క‌డే దీక్ష‌కు కూర్చోవాల‌ని నిర్ణ‌యించారు. అదేస‌మ‌యంలో జిల్లాల్లోనూ పార్టీ కార్యాల‌యాల్లో దీక్ష‌లు చేయాల‌ని.. పార్టీ జిల్లా అధ్య‌క్షుల‌కు పిలుపునిచ్చారు. మ‌రోవైపు.. పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న శ‌నివారం ఢిల్లీకి వెళ్లి.. స్వ‌యంగా హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయి.. ఇక్క‌డి విష‌యాలపై ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అదేవిధంగా కేంద్రంలో త‌న‌కు క‌లిసి వ‌చ్చే పార్టీల‌తో క‌లిసి .. దీనిపై చ‌ర్చించాల‌ని కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా చూస్తే.. టీడీపీ ఆఫీస్‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌ల‌ను చంద్ర‌బాబు చాలా సీరియ‌స్‌గానే తీసుకున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.