ఒక్క క్లైమాక్స్‌కే 50 కోట్లా?

‘బాహుబలి’తో ఇండియాలో మరే హీరోకూ సాధ్యం కాని స్థాయిని అందుకున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ ఇమేజ్ రావడంతో అతను వరుసగా తన రేంజికి తగ్గ సినిమాలే చేస్తున్నాడు. ఇకపై అతను చిన్న, మీడియం రేంజ్ సినిమాలే చేసేలా కనిపించడం లేదు.

ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులు ఒక భారీతనం ఆశిస్తుండటంతో ఓ మోస్తరు బడ్జెట్లో చేయాలనుకుని మొదలుపెట్టిన సినిమాలు కూడా తర్వాత పెద్ద రేంజికి వెళ్లిపోతున్నాయి. ప్రభాస్ చివరి సినిమా ‘సాహో’ మీడియం బడ్జెట్లో చేయాలనుకున్నదే. కానీ తర్వాత దాని బడ్జెట్ అమాంతం పెరిగిపోయి 300 కోట్లను దాటిపోయింది. దీని తర్వాత ప్రభాస్ మొదలుపెట్టిన ‘రాధేశ్యామ్’ కూడా అంతే.

దీన్ని మామూలు ప్రేమకథలా తీయాలనుకున్నారు. యాక్షన్ అవసరం లేని సినిమా కావడంతో బడ్జెట్ మరీ ఎక్కువేమీ కాదనుకున్నారు. కానీ భారీ సెట్టింగ్స్ వేయడం.. ఒక నగరాన్నే సెట్టింగ్స్ ద్వారా పున:సృష్టించే ప్రయత్నం చేయడం.. విదేశాల్లో వేర్వేరు లొకేషన్లలో షూటింగ్ చేయడం బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ఈ ప్రేమకథా చిత్రానికి కూడా రూ.250 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

ఇందులో కేవలం క్లైమాక్స్ కోసం రూ.50 కోట్లు వెచ్చించారట. దాదాపు 15 నిమిషాలు సాగే క్లైమాక్స్ ప్రేక్షకులను మరో లోకానికి తీసుకెళ్లేలా ఉంటుందని.. ఆ భారీతనం, విజువల్స్ చూసి ప్రేక్షకులు మైమరిచిపోతారని అంటున్నాయి చిత్ర వర్గాలు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘రాధేశ్యామ్’ను జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వేర్వేరు కాలాల్లో సాగే ఈ ప్రేమక చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. మరి ‘సాహో’ లాగా కాకుండా ఈ సినిమా అయినా అంచనాలను అందుకుని ప్రభాస్‌కు మంచి విజయాన్నందిస్తుందేమో చూడాలి.