రకుల్.. మళ్లీ అడవికి!

రీసెంట్‌గా వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి ‘కొండపొలం’ చేసుకోడానికి అడవి బాట పట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు మరోసారి అడవికి వెళ్లబోతోంది. అదీ బాలీవుడ్ సినిమా కోసం. అశుతోష్ గోవారికర్ డైరెక్షన్‌లో ఫర్హాన్ అఖ్తర్‌‌ హీరోగా తెరకెక్కనున్న మూవీలో రకుల్ హీరోయిన్‌గా నటించనుంది. ఆ సినిమా ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండబోతోంది.

ఒకప్పుడు సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రకుల్, ఆ తర్వాత రేసులో కాస్త వెనుకబడింది. ప్రస్తుతం అక్టోబర్ 31 లేడీస్ నైట్, అయలాన్‌ తప్ప దక్షిణాదిన వేరే సినిమాలేవీ చేయడం లేదు. కానీ బాలీవుడ్‌లో మాత్రం బాగానే చక్రం తిప్పుతోంది. అటాక్, మేడే, థ్యాంక్ గాడ్, డాక్టర్ జి, ఛత్‌రీవాలీ అంటూ బోలెడన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేతిలో. ఇప్పుడు అశుతోష్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది.

హిస్టారికల్ సినిమాలు తీయడంలో అశుతోష్ ఎక్స్‌పర్ట్. లగాన్, జోధా అక్బర్, మొహంజొదారో, పానిపట్ లాంటి బ్లాక్ బస్టర్స్ తీశాడు. ఆ జానర్‌‌తో విసిగిపోయాడో ఏమో.. రూటు మార్చి సోషల్ సబ్జెక్ట్‌తో పక్కా కమర్షియల్ మూవీ తీయాలని డిసైడయ్యాడు. ఫర్హాన్ అఖ్తర్‌‌ హీరోగా ‘పుకార్’ అనే సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా అడవి నేపథ్యంలో ఉంటుంది. ఫర్హాన్ ఫారెస్ట్ ఆఫీసర్‌‌గా కనిపిస్తాడు. అడవిని, అటవీ సంపదను కాపాడటానికి అతను పడే తపనే ఈ సినిమా కాన్సెప్ట్. మరో విశేషమేమిటంటే ఈ మూవీతో జగపతిబాబు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడట. తనని విలన్‌గా సెలెక్ట్ చేసుకున్నాడట అశుతోష్.

పదిహేనేళ్ల తర్వాత జావెద్ అఖ్తర్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే రాయడం మరో విశేషం. డిసెంబర్‌‌లో సినిమా సెట్స్‌కి వెళ్తుంది. ‘ఛత్‌రీవాలీ’ సినిమాని పూర్తి చేసిన తర్వాత రకుల్‌ ఈ మూవీ షూట్‌లో జాయినవుతుంది. మొత్తానికి బీటౌన్‌లో రకుల్ జర్నీ చాలా ఇంటరెస్టింగ్‌గా సాగుతోంది.