జగన్ పాలన చూస్తే జాలేస్తోంది – ఐవైఆర్‌

చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, త‌ద‌నంత‌రం.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన మాజీ ఐఏఎస్‌.. అధికారి ఐవైఆర్ కృష్ణారావు.. తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేస్తోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న త‌ర‌చుగా ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణ‌రావు.. పార్టీ జెండా ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి రాక‌పోయినా.. మైకు పుచ్చుకుని మాత్రం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఏపీ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న పాయింట్ అవుట్ చేశారు.

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేస్తోందని.. కృష్ణారావు అన్నారు. ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఆలస్యంగా వస్తున్నాయని.. ఆస్పత్రిలో పరికరాలు కూడా లేని పరిస్థితి ఉందని విచారం వ్యక్తం చేశారు. విశాఖలోని భూములు కూడా తాకట్టు పెట్టే పరిస్థితిని చూస్తున్నామని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితికి నిదర్శనమన్నారు. రాష్ట్రం నెత్తిమీద ఉన్న అప్పును ఎలా తీరుస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పు తేవడం.. పంచడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇంక ఎంతకాలం అప్పు పుడుతుందో ఆలోచించుకోవాలన్నారు.

ఏపీ పాల‌కుల‌కు సరైన ఆలోచనా విధానం లేక పరిస్థితి తారుమారైందని ఐవైఆర్ అన్నారు. అయితే.. ఇదే స‌మ‌యంలో ఆయ‌న తెలంగాణ జోలికి పోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఏపీ అంత కాక‌పోయినా.. ఇక్క‌డ కూడా అప్పులు తీసుకు వ‌స్తున్నారు. జీతాలు కూడా ఆల‌స్యం అవుతున్నాయ‌ని.. కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఐవైఆర్ ఎప్పుడూ.. తెలంగాణ స‌ర్కారును కార్న‌ర్ చేయ‌లేదు. పోనీ.. ఏపీనే టార్గెట్ చేస్తున్నార‌ని అనుకున్నా.. ఇక్క‌డ బీజేపీ ఎదుగుద‌ల‌కు ఆయ‌న చేసింది ఏమీ క‌నిపించ‌డం లేదు.

బీజేపీ స‌భ్య‌త్వం తీసుకుని.. ఇప్ప‌టికి మూడేళ్లు అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీకి కూడా ఆయ‌న ఎలాంటి సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చింది లేదు. మ‌రి అలాంట‌ప్పుడు.. ఆయ‌న ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించి ఏం చేయాల‌ని అనుకుంటున్నార‌నేది విశ్లేష‌కుల భావ‌న‌. ఏదైనా ఉంటే.. మాజీ సీఎస్‌గా ఆయ‌న స‌ల‌హాలు ఇవ్వొచ్చు. కానీ.. అది వ‌దిలేసి.. కేవ‌లం రాజ‌కీయ‌నాయ‌కుడి మాదిరిగా విమ‌ర్శ‌ల వ‌ర‌కే ప‌రిమితం అయితే.. మిగిలిన వారికి ఐవైఆర్‌కు తేడా ఏముంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.