టీడీపీపై దాడి.. జ‌న‌సేనాని ఏమ‌న్నాడంటే?

మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లు చోట్ల‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని భావిస్తున్నారు.

ఈ దాడుల‌పై ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ దాడుల‌పై త‌న స్పంద‌న‌ను తెలియ‌జేశారు. ఆయ‌న ఈమేర‌కు ఒక వీడియో బైట్‌ను మీడియాకు రిలీజ్ చేశారు. అందులో ప‌వ‌న్ ఏమ‌న్నాడంటే..

‘‘జ‌న‌సేన ఐటీ విభాగానికి సంబంధించిన స‌మావేశంలో ఉండ‌గా ఇప్పుడే ఒక వార్త తెలిసింది. విజ‌య‌వాడ‌, మంగ‌ళ‌గిరి టీడీపీ ఆఫీసుల మీద.. అలాగే విశాఖ‌ప‌ట్నం, ప్రొద్దుటూరు నాయ‌కుల మీద దాడులు జ‌రిగాయని. ఇంత‌కుముందు ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే లేని విధంగా మొట్ట‌మొద‌టిసారి పార్టీ ఆఫీసుల మీద ఇలా దాడి చేశారు. ఈ సంస్కృతి ప్ర‌జాస్వామ్యానికి ఏమాత్రం క్షేమ‌కరం కాదు. మేమెప్పుడు చెప్పేది ఒక‌టే. ప్ర‌జాస్వామ్యంలో నియంత్ర‌ణ పాటించాలి. వ్య‌క్తిగ‌తంగా దాడుల‌కు పాల్ప‌డ‌టం కానీ, పార్టీ ఆఫీసులు, నాయ‌కుల ఇళ్ల మీద దాడులు చేయ‌డం కానీ.. అది అరాచ‌కానికి, దౌర్జ‌న్యానికి దారి తీస్తుంది త‌ప్ప ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జాస్వామ్యానికి అది ఎంత‌మాత్రం క్షేమ‌క‌రం కాదు. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం కూడా దృష్టిసారించాలి. కేంద్ర హోం శాఖ త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసు శాఖ కూడా వెంట‌నే చ‌ర్య‌లు చేప‌ట్టాలి. భ‌విష్య‌త్తులో ఇలాంటివి జ‌ర‌క్కుండా చూడాలి. దోషుల‌ను ప‌ట్టుకుని శిక్షించ‌క‌పోతే అది ప్ర‌జాస్వామ్యానికి మంచిది కాదు. దాడులు చేసిన వాళ్లు వైసీపీ వాళ్ల‌ని అంటున్నారు. వైసీపీ నాయ‌క‌త్వానికి కూడా ఒక‌టే తెలియ‌జేస్తున్నా. ఇలాంటి పోక‌డ‌లు నియంత్రించుకోకుంటే ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టు, ద‌య‌చేసి ఇలాంటివి స‌రి చేసుకోండి’’ అని ప‌వ‌న్ పేర్కొన్నాడు.