డీజీపీ ఎక్కడ పడుకున్నారు: చంద్రబాబు సీరియస్

ఏపీ అట్టుడికిపోతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు టీడీపీ ఆఫీసులపై దాడులు వైసీపీ పనే అని, ఇది చాలా ఆర్గనైజ్డ్ గా చేసిన అరాచకం అని చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం జగన్‌కు తెలిసే పక్కా ప్లాన్ తో టీడీపీ కార్యాలయాలపై దాడి జరిగిందని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు.

ఇలాంటి స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వం, పోలీసులు కుమ్మక్కై పార్టీ కార్యాలయంపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 ఏళ్ల పాటు రాజకీయాలు చూశానని ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగలేదని చెప్పారు. 100 మీటర్లలోపే డీజీపీ కార్యాలయం ఉన్నా… దాడులు ఆపలేకపోయారని చంద్రబాబు తప్పుబట్టారు. డీజీపీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదని ఆరోపించారు. గవర్నరుకు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారని ఆయనకు రాష్ట్ర పరిస్థితి వివరించానని చంద్రబాబు తెలిపారు. డ్రగ్ మాఫియాకు రాష్ట్రం అడ్డాగా మారిందని దుయ్యబట్టారు.

‘‘ఏపీలో గంజాయి ఉత్పత్తి చేసి దేశం మొత్తం సరఫరా చేస్తుంటే ప్రశ్నించకూడదా..? స్టేట్ టెర్రరిజానికి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నాం. . పులివెందుల రాజకీయాలు చేస్తారా? పార్టీ కార్యాలయంపై దాడులు చేసి చంపే ప్రయత్నం చేస్తోంటే డీజీపీ ఎక్కడ పడుకున్నారు. డీజీపీ నేరస్తులతో లాలూచీ పడతారా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం పైనా టీడీపీ నేతల పైనా దాడులు జరిగితే.. ప్రజాస్వామ్యం ఎక్కడిది అని ప్రశ్నించారు. డీజీపీ కార్యాలయం పక్కన దాడులు చేస్తే ఆర్టికల్ 356 ఎందుకు అమలు చేయకూడదని చంద్రబాబు నిలదీశారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్‌కు చంద్రబాబు పిలుపునిచ్చారు.