కౌశిక్ రెడ్డి కోసం కోర్టుకు!

తెలంగాణ‌లో రాజ‌కీయ వేడిని ర‌గిల్చిన హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యం కోసం టీఆర్ఎస్ అధినేత ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామ‌దాన‌బేధదండోపాయాల‌ను ప్ర‌యోగిస్తున్నార‌నే అభిప్రాయాలు ఉన్నాయి. త‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లి త‌న‌కే ఎదురు తిరిగిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డం కోసం కేసీఆర్ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు. అందుకే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌ముందే హుజూరాబాద్‌లోని ఇత‌ర పార్టీలకు చెందిన కీల‌క నేత‌ల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని వ్యూహాత్మ‌కంగా పార్టీలో చేర్చుకున్నారు. టీఆర్ఎస్‌లో చేరిన ఆయ‌న‌కు కేసీఆర్ ఏ ప‌ద‌వి ఇస్తారోన‌ని అనుకుంటున్న స‌మ‌యంలో గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

కౌశిక్‌ను గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేట్ చేసి ఆ ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి పంపించారు. సామాజిక సేవ విభాగంలో కౌశిక్‌ను ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేట్ చేసిన‌ట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్‌కు తెలిపింది. ఇక్క‌డి వ‌ర‌కూ అంతా బాగానే సాగింది. కానీ సామాజిక సేవ విభాగంలో కౌశిక్‌ను ఎమ్మెల్సీ చేసేందుకు తమిళిసై వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేసి ఆ ప్ర‌తిపాద‌న‌ను పెండింగ్‌లో పెట్ట‌డంతో క‌థ మ‌లుపు తిరిగింది. దీంతో కౌశిక్‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి వ‌స్తుందో రాదోన‌నే టెన్ష‌న్ ఆయ‌న అనుచ‌రుల్లో పెరిగిపోయింది. మ‌రోవైపు కేవ‌లం హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే టీఆర్ఎస్ కౌశిక్‌ను వాడుకుని వ‌దిలేస్తుంద‌నే ప్ర‌చారాన్ని బీజేపీ కాంగ్రెస్ నేత‌లు మొద‌లెట్టారు.  దీంతో ఈ ప్ర‌చారం త‌మ‌క ఎన్నిక‌లో న‌ష్టం క‌లిగిస్తుంద‌ని భావించిన టీఆర్ఎస్ ఈ విష‌యంలో ఏదో ఒకటి చేయాల‌ని అనుకుంటున్న‌ట్లు స‌మాచారం.

కౌశిక్ ఎమ్మెల్సీ ప్ర‌తిపాద‌న‌పై గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం తీసుకోకుండా ఉండ‌టాన్ని హైకోర్టులో స‌వాలు చేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హారాష్ట్రలోనూ గ‌తంలో ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని గ‌వ‌ర్న‌ర్ పెండింగ్‌లో పెడితే అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం కోర్టును ఆశ్ర‌యించింది. ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా అదే దారిలో సాగాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. కోర్టుకు వెళ్ల‌డం ద్వారా ఎన్నిక‌ల‌కు ముందే కౌశిక్ విష‌యంలో టీఆర్ఎస్ నాయ‌క‌త్వం చిత్త‌శుద్ధితో ఉంద‌ని చాటి చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని పార్టీ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

అయితే ఈ విష‌యంపై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని స‌మాచారం. అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌ర్వాత కోర్టుకు వెళ్లాలా? లేదా మ‌రికొంత కాలం వేచి చూడాలా? అనే అంశంపై కేసీఆర్ ఓ నిర్ణ‌యం తీసుకునే ఆస్కారం ఉంది. మ‌రోవైపు టీఆర్ఎస్ నాయ‌క‌త్వంపై కౌశిక్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో పార్టీ విజ‌యం కోసం ప‌ని చేస్తున్నార‌ని ఆయ‌న‌కు ఎలాంటి అసంతృప్తి లేద‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు చెప్తున్నాయి.