అన్నాడీఎంకే లో చీలిక తప్పదా ?

అన్నాడీఎంకేలో శశికళ చిచ్చు పెట్టేశారు. పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పార్టీకి తానే జనరల్ సెక్రటరీని అంటు ప్రకటించుకున్నారు. చెన్నైలోని టీ నగర్ లో ఉన్న ఎంజీఆర్ మెమోరియల్ లో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించిన శశికళ ఓ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ శిలాఫలకంపై పార్టీ ప్రధాన కార్యదర్శిగా తన పేరునే రాయించుకున్నారు. దాంతో పార్టీలో గందరగోళం మొదలైంది.

ఒకవైపు శశికళ వర్గం మరోవైపు పన్నీర్ శెల్వం+పళనిస్వామి వర్గాలు పోటీపోటీగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాయి. ఏఐఏడీఎంకే ఏర్పాటు చేసి ఆదివారం నాటికి 50 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రమంతా కార్యక్రమాలను పోటీలు పడి రెండు వర్గాలు ఘనంగా నిర్వహించాయి. దాంతో పార్టీ నేతలు, క్యాడర్ మొత్తం అయోమయంలో పడిపోయింది. పైగా పార్టీకి పూర్వవైభవం తీసుకురావటానికి అందరం కలిసి పనిచేద్దామంటూ శశికళ పిలుపిచ్చారు.

రెండు వర్గాల మధ్య జరగుతున్న పరిణామాలు చూసిన తర్వాత పార్టీలో చీలిక తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే శశికళతో పోల్చుకంటే పన్నీర్+పళనికి జనాల్లో క్రేజు తక్కువే. శశికళకున్న క్రేజు కూడా దివంగత ముఖ్యమంత్రి జయలలితను అంటిపెట్టుకున్న కారణంగా వచ్చిందనే విషయాన్ని మరచిపోకూడదు. ఇదే సమయంలో పళనిస్వామికి కూడా మంచి సీఎం అనే పేరుంది. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా దాదాపు నాలుగేళ్ళు తమిళనాడును పళనిస్వామి బాగానే రూల్ చేశారని జనాల అభిప్రాయం.

ఎక్కడా అవినీతి ఆరోపణలు లేకుండానే పళని ప్రభుత్వాన్ని నడిపారు. కాకపోతే అనేక కారణాల వల్ల అన్నాడీఎంకే ఓడిపోయింది. ఇక్కడే మరో విషయం ఏమిటంటే ఒకపుడు పార్టీ నుండి శశికళను బహిష్కరించారు. అంటే అప్పటివరకు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమెను పార్టీ నుండే బహిష్కరించారంటే పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేనట్లే. ఈ విషయమై అప్పట్లోనే శశికళ కోర్టులో కేసు వేశారు. కోర్టులో కేసు ఇంకా తేలకుండానే తనను తాను ప్రధాన కార్యదర్శిగా ఆమె ఎలా ప్రకటించుకుంటారని పన్నీర్+పళని వర్గం అడుగుతోంది.

మొత్తానికి శశికళ ఆలోచనలు చూస్తుంటే పార్టీని చీల్చయినా తాను ప్రధాన కార్యదర్శిగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నట్లు అనుమానంగా ఉంది. మరి పార్టీ నిజంగానే చీలిపోతే జనాలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. ఎందుకంటే జనాలు అభిమానించే ఎంజీఆర్, జయలలిత ఇపుడు లేరు. వారి వారసులుగా ఎవరు కూడా పార్టీలో లేరు. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో చీలిక వస్తే జనాదరణ ఎవరికి దక్కుతుంది ? లేకపోతే వేరే దారిలేక పన్నీర్+పళని శశికళ ఆధిపత్యాన్ని ఆమోదిస్తారా అన్నది చూడాల్సిందే.