ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ ముచ్చట్లు

ప్రకాష్ రాజ్ ఎప్పుడైనా మీడియాతో మాట్లాడితే సినిమాలు, రాజకీయాల చర్చే ఉంటుంది. కుటుంబం గురించి ఆయన దాదాపుగా ఎప్పుడూ మాట్లాడింది లేదు. మొదటి భార్య లతతో విడాకులు తీసుకోవడం, లేటు వయసులో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను రెండో పెళ్లి చేసుకోవడం.. తన పిల్లలు, కుటుంబం గురించి ఆయన ఎప్పుడూ మీడియాతో విషయాలు పంచుకున్నది లేదు. ఐతే ఆలీ నిర్వహించే టీవీ షోలో ఆయన కుటుంబం గురించి వివరంగా మాట్లాడారు. తనకు ఒక చెల్లెలని.. ఆమె యుఎస్‌లో స్థిరపడిందని, అలాగే తనకు ఒక తమ్ముడూ ఉన్నాడని.. అతను హైదరాబాద్‌లోనే ఉంటాడని ప్రకాష్ రాజ్ వెల్లడించాడు.

ఇక పిల్లల గురించి ప్రకాష్ రాజ్ చెబుతూ.. “నాకు ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయికి 25 ఏళ్లు. నా ఫాం హౌస్‌లను ఆమే చూసుకుంటుంది. తన కాళ్ల మీద తను నిలబడింది. రెండో అమ్మాయి మేఘన. ఏఆర్‌ రెహమాన్‌ దగ్గర సంగీతం నేర్చకుంటోంది. ఒక అబ్బాయి ఉన్నాడు. నా మొదటి కొడుకు పేరు సిద్దార్థ్‌. ఓ ప్రమాదంలో చనిపోయాడు” అని చెప్పాడు.

తన రెండో పెళ్లి గురించి ప్రకాష్ రాజ్ వివరిస్తూ.. “నా మొదటి భార్య లత నుంచి కొన్ని కారణాల వల్ల విడిపోయాను. ఆ తర్వాత ఒంటరితనం ఏర్పడింది. ఆ సమయంలోనే ఓ సినిమా చేస్తున్నపుడు పోనీ వర్మను మొదటిసారి చూశా. ఆమె ముంబయికి చెందిన కొరియోగ్రాఫర్‌. తర్వాత బాలచందర్ గారి సినిమా చేస్తున్నపుడు అర్జెంటుగా కొరియోగ్రాఫర్ అవసరం పడింది. పక్కనే విజయ్‌ హీరోగా నటిస్తున్న సినిమా సెట్‌కు వెళ్తే అక్కడ పోనీ కనిపించింది. మీరు చేస్తారా అంటే సరే అంది. అలా ఆమెతో పరిచయం పెరిగి పెళ్లి వరకు వచ్చింది. నాకు అప్పటికే ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పూజా మా పెళ్లికి అంగీకరించింది. తర్వాత పోనీ వాళ్లింటికి వెళ్లి కలిశాను. వాళ్లు ముందు ఒప్పుకోలేదు. కానీ పోనీ బలవంతం చేయడంతో సరే అన్నారు. నా మొదటి భార్య లత, పోనీ ఇప్పుడు మంచి స్నేహితులుగా మారారు” అని వివరించారు.