హ‌ద్దు మీరొద్దు.. కాంగ్రెస్‌కు ‘సోనియా రేఖ‌లు’

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే కాంగ్రెస్‌కు జీవితకాల‌ అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. అయితే.. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందన్నారు. అదేస‌మ‌యంలో పార్టీలో కొంద‌రు నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆమె తీవ్ర‌స్థాయిలో అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పార్టీలో కీల‌కంగా ఉంటూ.. బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. మీడియా ముందుకు వ‌చ్చే ముందు ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించుకోవాల‌న్నారు. ఎవ‌రూ హ‌ద్దులు దాటొద్దంటూ.. సోనియా వ్యాఖ్యానించారు.

ప్ర‌స్తుతం ఖాళీగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక,యూపీలోని లఖింపుర్ ఘటన, పలు రాష్ట్రాలకు వ‌చ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు..తదితర అంశాలే అజెండాగా దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ) సమావేశం జ‌రుగుతోంది. జూన్ 30 నాటికే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు రోడ్ మ్యాప్ ఖరారు చేసినప్పటికీ కరోనా రెండో దశ వల్ల వాయిదా పడిందని సోనియా గాంధీ అన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ పూర్వవైభవం కోరుకుంటున్నారని, అందుకు నాయకులు ఐక్యంగా ఉండటం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం అవసరమన్నారు.

పార్టీ నేతలు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెబితే తాను అభినందిస్తానని.. కానీ మీడియా ద్వారా తెలియజేయాల్సిన అవసరం లేదని సోనియా అన్నారు. నేతలంతా కేవలం పార్టీ ప్రయోజనాల మీద మాత్రమే దృష్టి సారించి ఐకమత్యంగా కృషి చేస్తే రాబోయే అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని సోనియా అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సోనియా ఘాటు విమర్శలు గుప్పించారు. దేశ ఆర్థిక వ్యవస్ధ ఆందోళనకరంగా తయారైందని.. దీనికి సమాధానంగా కేంద్రం కేవలం ఆస్తులను విక్రయిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అంటే కేవలం వ్యూహాత్మకమైనవి మాత్రమే కాదని, దానికి సామాజిక లక్ష్యాలు కూడా ఉంటాయని అన్నారు.

నూతన సాగు చట్టాలు, లఖింపుర్‌ ఘటన, చైనా చొరబాట్లు, జమ్ముకశ్మీర్‌లో మైనార్టీల హత్యల అంశంలో కూడా కేంద్రంపై సోనియా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరగుతున్న సీడబ్ల్యూసీ సమావేశానికి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ హాజరయ్యారు. గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ సహా ఇతర జీ-23 నేతలు హాజరయ్యారు.