బయోపిక్స్‌పై భామల మోజు

ఒకప్పుడు బయోపిక్స్ అనేవి చాలా అరుదుగా వచ్చేవి. నూటికో కోటికో ఓ ఫిల్మ్ మేకర్‌‌ రియల్ లైఫ్ స్టోరీతో వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా అలాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో సగం సినిమాలు ఇవే. చాలామంది యాక్టర్స్‌ కూడా బయోపిక్స్‌పై బాగా మోజు పడుతున్నారు. హీరోయిన్స్‌ కూడా గ్లామర్‌‌ డాల్స్‌లా మిగిలిపోవడం ఇష్టం లేక ఇలాంటి సినిమాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. నిజ జీవిత పాత్రల్లో కనిపిస్తే తమ టాలెంట్‌ని పూర్తి స్థాయిలో వెలికి తీసే అవకాశం ఉండటమే అందుకు కారణం. ఇప్పుడు జాన్వీ కపూర్, తాప్సీ పన్ను కూడా బయోపిక్స్‌పై ఇష్టాన్ని బయటపెట్టారు.

ఆల్రెడీ జాన్వీ ఫస్ట్ ఎయిర్‌‌ఫోర్స్ పైలట్ ‘గుంజన్ సక్సేనా’ జీవిత కథలో నటించింది. ఇప్పుడు అరుణిమ సిన్హా పాత్రలో నటించాలని ఉందంటోంది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి ఫిజికల్లీ చాలెంజ్డ్‌ ఉమన్ ఆమె. కొందరు దుండగుల దాడిలో కుడికాలు పోయింది. అయినా కూడా పట్టుదలతో తన 25వ యేట ఎవరెస్టును ఎక్కింది. అంతటి ఇన్‌స్పైరింగ్ లేడీ క్యారెక్టర్‌‌ని పోషించాలని చాలా ఆశగా ఉందంటోంది జాన్వీ.

ఇక తాప్సీ అయితే బయోపిక్స్‌కి కేరాఫ్ అని చెప్పాలి. ఆల్రెడీ మిషన్ మంగళ్, శాండ్‌కీ ఆంఖ్ చిత్రాల్లో రియల్ లైఫ్ క్యారెక్టర్స్ చేసిన తాప్సీ, ప్రస్తుతం మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తోంది. ఫ్రీడమ్‌ ఫైటర్ ఉషా మెహతా లైఫ్ స్టోరీలోనూ నటించబోతోందని వార్తలొస్తున్నాయి. స్వాతంత్య్ర పోరాట సమయంలో అండర్‌‌ గ్రౌండ్ రేడియో స్టేషన్‌లు చాలా ఉపయోగపడేవి. వీటిని ఉషా మెహతాయే మొదలుపెట్టారు. ఇండిపెండెన్స్ మూమెంట్‌లో విశేష కృషి చేశారు. ఓ సందర్భంలో జైలుపాలయ్యారు కూడా. ఆవిడకి దగ్గరి బంధువైన కేతన్‌ మెహతా ఉష బయోపిక్ తీయాలనుకుంటున్నాడు. కరణ్ జోహార్ నిర్మించనున్నాడు.

నిజానికి ఈ మూవీలో తాప్సీని ఇంకా కన్‌ఫర్మ్ చేయలేదు. కానీ చేశారనే వార్తలు రావడంతో ఆమె రియాక్టయ్యింది. ‘ఇప్పటికైతే నన్నింకా సంప్రదించలేదు. వాళ్లు అడిగితే మాత్రం కచ్చితంగా ఎస్ చెబుతాను. అంత గొప్ప ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర చేయడం నిజంగా అదృష్టం’ అంటోంది తాప్సీ. ఇంకేముంది.. ఇప్పటివరకు ఆమెను తీసుకునే ఆలోచన రాకపోయినా.. ఇంటరెస్ట్ చూపిస్తోందని తెలిస్తే తప్పకుండా తీసుకుంటాడు కేతన్. ఎందుకంటే బాలీవుడ్‌లో తాప్సీ డిమాండ్ ఆ రేంజ్‌లో ఉందిప్పుడు.