100 కోట్ల వీరుడు. 5 కోట్లకు పడ్డాడు


100 కోట్ల వీరుడు. 5 కోట్లకు పడ్డాడు
టాలీవుడ్లో ఏ హీరోకూ దొరకని బ్లాక్‌బస్టర్ ఎంట్రీ దొరికింది మెగాస్టార్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్‌కు. తొలి సినిమా ‘ఉప్పెన‌’తో ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిన ఘనుడతను. ఈ క్రెడిట్ మొత్తం అతడికే కట్టబెట్టలేం కానీ.. ఒక సాహసోపేతమైన, వైవిధ్యమైన ప్రేమకథతో ఇలాంటి భారీ విజయాన్నందుకుని ఔరా అనిపించాడు వైష్ణవ్. ఇలాంటి పాత్ర చేసినందుకు, డీగ్లామరస్ రోల్‌తో అరంగేట్రం చేసినందుకు అతడికి ప్రశంసలు దక్కాయి.

క్రిష్ లాంటి దర్శకుడు, మరో వైవిధ్యమైన కథతో వైష్ణవ్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. అదే.. కొండపొలం. ఇదే పేరుతో వచ్చిన ఓ మంచి నవల ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో వైష్ణవ్ ఖాతాలో మరో హిట్టు పడుతుందని, అతను హీరోగా ఇంకా పైకి వెళ్తాడని అనుకున్నారు. క్రిష్ సైతం ప్రి రిలీజ్ ఈవెంట్లో.. వైష్ణవ్‌ను మరో మెట్టు ఎక్కించినట్లు ధీమాగా చెప్పాడు.

కానీ తీరా చూస్తే.. ‘కొండపొలం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాబట్టలేకపోయింది. యావరేజ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోతోంది. నాలుగు రోజుల్లో ‘కొండపొలం’ సాధించిన వసూళ్లు కనీస స్థాయిలో ఉన్నాయి. ఐదు కోట్ల గ్రాస్, మూడు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది తొలి నాలుగు రోజుల్లో. ఇంతకుమించి వసూళ్లు పెద్దగా పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. వీకెండ్లోనే ఈ సినిమా సరిగా పెర్ఫామ్ చేయలేకపోయింది. తొలి రోజు మార్నింగ్ షోలకు స్పందన బాగున్నా.. సాయంత్రానికి సందడి కనిపించలేదు.

శని, ఆదివారాల్లోనూ అంతంతమాత్రంగానే ఆడిన సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అని అర్థమైపోయింది. సినిమాను తక్కువ బడ్జెట్లో తీసి, తక్కువ రేట్లకే అమ్మినా కూడా బయ్యర్లకు నష్టాలు తప్పడం లేదు. ఉప్పెన, కొండపొలం పూర్తి భిన్నమైన చిత్రాలు. ఉప్పెనకు వచ్చిన క్రేజ్ వేరు. రిలీజ్ టైంలో దానికి కలిసొచ్చిన అంశాలు వేరు. అయినప్పటికీ తొలి సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ సాధించిన హీరో.. రెండో సినిమాకు రూ.5 కోట్ల రేంజికి పడిపోవడం అనూహ్యమే.