లెజండరీ నటుడు కన్నుమూత!

ప్రముఖ మలయాళ నటుడు నెడుమూడి వేణు(73) కన్నుమూశారు. కొన్ని నెలలుగా కడుపు సంబంధిత వ్యాధులతో పోరాడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కేరళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన ఈరోజు(అక్టోబర్ 11) తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆయన కోవిడ్ తో పోరాడి గెలిచారు. కానీ ఇంతలోనే అనారోగ్యంతో మరణించడం అభిమానులను బాధిస్తోంది.

ఈయన మరణవార్త విన్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. లెజండరీ నటుడిని కోల్పోయామంటూ పోస్ట్ లు పెడుతున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్ లాంటి స్టార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నెడుమూడి వేణు మళయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులయ్యారు.

ఆయన అసలైన పేరు కేశవన్ వేణుగోపాల్ అయినప్పటికీ.. స్టేజ్ నేమ్ నెడుమూడి వేణుతో పాపులర్ అయ్యారు. ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆయన 500కి పైగా చిత్రాల్లో నటించారు. నటనతో పాటు కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఓ సినిమాకి దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. తన కెరీర్ లో నటుడిగా మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను, ఆరు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు.