‘ఆచార్య’పై మెగా అభిమానుల అసంతృప్తి?


‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. 2022 ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రకటన వచ్చేసింది. ఐతే ఈ డేట్ చూసి మెగా అభిమానుల్లో ఏమంత ఎగ్జైట్మెంట్ కనిపించడం లేదు. ఇంకా చెప్పాలంటే వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముందు నుంచి టాలీవుడ్ ఒరవడి గమనిస్తే.. ఫిబ్రవరిలో ఏ భారీ చిత్రాలూ విడుదలైన దాఖలాలు పెద్దగా కనిపించవు. సంక్రాంతి, వేసవి, దసరా, క్రిస్మస్.. ఇలాంటి క్రేజీ సీజన్లనే పెద్ద సినిమాల కోసం ఎంచుకుంటారు. అవి కాకుంటే వేసవి తర్వాత, సంక్రాంతికి ముందు ఏ నెలలో సినిమాను రిలీజ్ చేసినా పర్వాలేదన్నట్లే ఉంటుంది.

తెలుగులో అనే కాక మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ సీజన్‌గా భావించేది, పెద్ద సినిమాలకు ఏమాత్రం అనువు కాని సీజన్ అంటే అది ఫిబ్రవరి-మార్చి మధ్యనే. రిపబ్లిక్ డే వీకెండ్ తర్వాత.. మార్చి చివరి వారానికి ముందు పెద్ద సినిమాలు రిలీజ్ కావడం చాలా అరుదు. టాలీవుడ్లో భారీ విజయాన్నందుకున్న సినిమాల లిస్టు తీస్తే ఈ సీజన్లో రిలీజైన చిత్రాలు దాదాపుగా కనిపించవు. ఇలాంటి సీజన్లో చిరంజీవి సినిమా రిలీజ్ చేయడం అభిమానులకు ఎంతమాత్రం రుచిస్తున్నట్లు లేదు.

నిజానికి ‘ఆచార్య’ను డిసెంబరు 17న రిలీజ్ చేస్తున్నట్లుగా ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఐతే అదే తేదీకి ‘పుష్ప’ ఫిక్స్ అయి ఉండటంతో అలా ెలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తాయి. ఐతే ‘పుష్ప’ను వాయిదా వేయించి, చిరు సినిమాను క్రిస్మస్ ముంగిట రిలీజ్ చేస్తారని అన్నారు. కానీ అలా ఏమీ జరగలేదు. చిరునే కాంప్రమైజ్ అయ్యాడు. ఈ విషయంలోనూ చిరు అభిమానుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ మధ్య బన్నీ ‘మెగా’ నీడ నుంచి బయటికొచ్చి సొంత ఇమేజ్ కోసం తాపత్రయపడుతున్న నేపథ్యంలో మెగా అభిమానుల్లోనే ఓ వర్గం అతణ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య, పుష్ప సినిమాల రిలీజ్ డేట్ల విషయమై చిరు-బన్నీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్ నడుస్తోంది. ఇప్పుడు బన్నీకి ఆ డేట్ వదిలేసి చిరు అన్ సీజన్లో తన చిత్రాన్ని రిలీజ్ చేయడానికి నిర్ణయించుకోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. ఇప్పుడు కుదరదంటే వేసవికి మార్చి నెలాఖరుకైనా వెళ్లాల్సింది కానీ.. ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయడమేంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.