రజినీని లైట్ తీసుకుంటున్నారేంటబ్బా

రజినీకాంత్‌కి దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన సినిమా వస్తోందంటే ప్రతిచోటా సందడి ఉండేది. ముఖ్యంగా తెలుగు నిర్మాతలంతా తమ సినిమాలు ఆయన సినిమాతో పోటీపడాలా అని అని టెన్షన్ పడేవి. కానీ ఇప్పుడది లేకపోవడం కాస్త ఆశ్చర్యపరిచే విషయమే. అలా అని రజినీ క్రేజ్ ఏమీ తగ్గిపోలేదు. ఇప్పటికీ ఆయన సినిమా కోసం ఎదురుచూసేవాళ్లు అలానే ఉన్నారు. మరి ‘అన్నాత్తే’ విషయంలో లెక్క ఎందుకు మారుతోంది!

ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తే’ సినిమా చేస్తున్నారు రజినీ. దీపావళి సందర్భంగా నవంబర్‌‌ 4న రిలీజ్ చేయనున్నారు. అయితే ఇంతవరకు ఈ సినిమా తెలుగు టైటిల్‌ని కూడా అనౌన్స్ చేయలేదు. నాలుగు రోజుల క్రితం ఫస్ట్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఇవాళ రజినీ, నయనతారలపై తీసిన రెండో పాటను వదిలారు. అది కూడా కేవలం తమిళంలోనే. తెలుగు అప్‌డేట్స్ ఊసే ఎక్కడా లేదు.

పోనీ ఇదేమైనా సింపుల్‌గా తీసేసిన సినిమానా అంటే అదీ కాదు. రజినీ, నయనతార, కీర్తి సురేష్, ఖుష్బూ, మీనా లాంటి భారీ కాస్టింగ్‌తో ప్రెస్టీజియస్‌గా తీస్తున్నాడు శివ. కరోనా వల్ల, తన అనారోగ్యం వల్ల పదే పదే బ్రేక్ పడినా.. పట్టుదలతో సినిమాని కంప్లీట్ చేశారు రజినీకాంత్. బాలసుబ్రహ్మణ్యం చివరగా పాట పాడింది కూడా ఈ సినిమాకే కావడంతో ఆ సాంగ్ రిలీజ్‌ అవ్వగానే వైరల్ చేశారు అభిమానులు. అయినా కూడా ‘అన్నాత్తే’ గురించి టాలీవుడ్‌లో అలికిడి లేదు.

రజినీ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజవుతుంది. ఈసారి కానీ అలా జరగడం లేదా అనే అనుమానం ఆల్రెడీ మొదలయ్యింది. విడుదలకి నెల రోజులు కూడా లేదింక. అయినా ఇప్పటికీ తెలుగు టైటిల్‌ కానీ, పాటలు కానీ ఎందుకు రావడం లేదు, అసలు తెలుగులో రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా అని ఫ్యాన్స్ తమిళ అప్‌డేట్ వచ్చిన ప్రతిసారీ అడుగుతున్నారు. దీనికి సమాధానం సినిమాని నిర్మిస్తున్న సన్‌ పిక్చర్స్‌ సంస్థే చెప్పాలి.