వైసీపీ కోసం.. 150 మంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు

వారంతా ఎంతో క‌ష్ట‌ప‌డి.. జేఈఈ చ‌దివారు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి రాత్ర‌న‌క‌.. ప‌గ‌ల‌న‌క‌.. కోచింగ్ తీసుకుని అడ్వాన్స్‌డ్ పాస‌య్యారు. ప్ర‌ఖ్యాత ఐఐటీల్లో చోటు సంపాయించుకున్నారు. అందునా.. ముంబాయి ఐఐటీ వంటి సంస్థ‌ల్లోనూ చ‌దువుతున్నారు. అయితే.. ఇప్పుడు ఇలాంటివారిలో చాలా మంది రోడ్డున ప‌డుతున్నారు! అదేంటి అనుకుంటున్నారా? ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న‌ ప్ర‌భుత్వాన్ని తిరిగి గెలిపించుకునేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. త‌ను అమలు చేస్తున్న సంక్షేమం.. ఇత‌ర ప‌థ‌కాలు.. వంటివి త‌న‌ను గెలిపిస్తాయ‌ని అంటున్నా.. ఎక్క‌డో తేడా కొడుతోంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. ఎన్ని నిధులు పంచినా.. అభివృద్ధి లేద‌నే మాట స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో అమ‌రావ‌తి గొంతు నులిమార‌నే ఆవేద‌న రాష్ట్ర ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తోంది.

అదేవిధంగా రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్తానిక ఎన్నిక‌ల్లోనూ.. ప‌రిష‌త్ స‌మ‌రంలోనూ తిరుప‌తి ఉప ఎన్నిక యుద్ధంలోనూ విజ‌యం సాధించినా.. జ‌గ‌న్‌కు సంతృప్తి లేకుండా పోయింద‌నే వాద‌న సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌న పాల‌న ఎలా ఉంది? ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఎలా ముందుకు వెళ్లాలి? వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అంటే.. మ‌రో రెండున్న‌రేళ్లు ఆగాలా? లేక పోతే.. మ‌రో ఏడాదిలోనే స‌ర్కారును ర‌ద్దు చేసుకుని ముందుకు సాగాలా? అనే అంశాల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌.. త‌న పాల‌న‌పై ప్ర‌జానాడి ఎలా ఉంద‌నే విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో 2019లో త‌న‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు వ్యూహాలు సిద్ధం చేసిన‌.. ప్ర‌శాంత్ కిశోర్‌కే జ‌గ‌న్ ఇటీవ‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఇక‌, ఇప్ప‌టికే ప్ర‌శాంత్‌.. అటు తెలంగాణ‌లోనూ జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల‌కు ప‌నిచేస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు టీం స‌రిపోలేదు. దీంతో తాజాగా పీకే బృందం ఇటీవల ముంబాయి ఐఐటీకి వెళ్లి, తమకు సుమారు 150 మంది గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న వారు కావాలని, వారిని తాము రిక్రూట్ చేసుకుంటామని ప్రిన్సిపల్‌ను కోరింద‌ట‌. నెలకు లక్షన్నరకు తగ్గకుండా జీతాలు ఇస్తామని కూడా చెప్పారు. అవసరమైతే మరో 150 మందిని వేరే ఐఐటీల నుంచి తీసుకుంటామని పీకే బృందంలో కీలక వ్యక్తి రిక్రూట్మెంట్‌కు సిద్దమవడం.. ఏపీ అవసరాల కోసమేనని రాజకీయ వర్గాలలో చ‌ర్చ న‌డుస్తోంది.

ఇంత చేస్తే.. ఈ ఐఐటీ చ‌దివిన వారు చేసేది ఏమైనా ఉంటుందా? అంటే.. వారు ప్ర‌తి రోజూ.. ప్ర‌జ‌ల‌కు వివిధ రూపాల్లో చేరువ అవ్వాలి. వారి మ‌న‌సులో మాట‌ల‌ను తెలుసుకోవాలి.. వారు జ‌గ‌న్ గురించి ఏమ‌నుకుంటున్నారో.. పాల‌న ఎలా ఉందో.. సంక్షేమ అమ‌లు ఎలా ఉందో.. తెలుసుకోవాలి. కొండ‌లెక్కాలి.. గుట్ట‌లు దిగాలి. ప్ర‌తి ఇంటి గ‌డ‌పా తొక్కాలి!! ఇదీ.. ఐఐటీ చ‌దివి.. పీకే బృందంలో చేరిన వారి ప‌రిస్థితి!! మ‌రి చూడాలి. ఎంత మంది ఈ రాజ‌కీయ కొలువుల‌కు చేరుతారో! ఇక్క్డడ చిత్రం ఏంటంటే.. ఆరు మాసాల త‌ర్వాత‌.. వీరి ఉద్యోగం ఖాళీ!! మ‌రి అప్పుడు మ‌రోసారి పొట్ట చేతన ప‌ట్టుకుని వీధిన ప‌డాల్సిందేన‌న్న మాట‌. ఇదీ.. సంగ‌తి అంటున్నారు నెటిజ‌న్లు.