మరో రెండు సినిమాలు అనౌన్స్ చేస్తాడా..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ దాదాపు ఐదేళ్ల పాటు ‘బాహుబలి’ సినిమా కోసం పని చేశారు. ఈ సినిమా అతడికి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఆ తరువాత నటించిన ‘సాహో’ పెద్దగా వర్కవుట్ అవ్వనప్పటికీ ప్రభాస్ ఇమేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఆయన నటిస్తోన్న ‘రాధేశ్యామ్’ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల కానుంది. మరోపక్క ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలను పట్టాలెక్కించారు.

ఈ సినిమాతో పాటు నాగశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో సినిమా అనౌన్స్ చేశారు ప్రభాస్. దీనికి ‘స్పిరిట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ 25వ సినిమాగా ఇది తెరకెక్కనుంది.

ఇది కాకుండా ప్రభాస్ మరో రెండు సినిమాలు అనౌన్స్ చేయబోతున్నాడని సమాచారం. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ చాలా కాలంగా ప్రభాస్ తో టచ్ లో ఉన్నారు. ఈ కాంబినేషన్ లో హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ సినిమానే కాకుండా దిల్ రాజు నిర్మాణంలో చేయబోతున్న సినిమాను కూడా ప్రభాస్ అనౌన్స్ చేయాలనుకుంటున్నారు. ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాల షూటింగ్స్ పూర్తి కాగానే.. ఈ రెండు సినిమాలను అనౌన్స్ చేయబోతున్నారు. అంటే వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ డైరీ ఫుల్ అయిపోయిందన్నమాట!