బీజేపీ అన్నంత ప‌ని చేసింది

రాజ‌కీయ పార్టీలు ఒక్కోసారి తీసుకునే నిర్ణ‌యాలు ఎవ‌రికి అంతు చిక్క‌వు. ఆ నిర్ణ‌యం వెన‌కాల ఎలాంటి వ్యూహం ఉందో క‌నిపిపెట్ట‌డం అంత సులువ‌గా ఉండ‌దు. ఎన్నిక‌లో పోటీ చేస్తే ఓడిపోతామ‌ని తెలిసినా కొన్ని సార్లు త‌మ ఉనికిని చాటుకోవ‌డానికి బ‌లం పెంచుకోవ‌డానికి బ‌రిలో దిగుతారు. ఇప్పుడు ఏపీలో కూడా బీజేపీ ఇదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. అనూహ్యంగా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపాడు. మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన ఈ ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నా బీజేపీ మాత్రం పోటీకి సై అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే ప‌ట్టు వ‌ద‌ల‌ని బీజేపీ త‌మ అభ్య‌ర్థిగా ప‌న‌త‌ల సురేశ్ పేరును ప్ర‌క‌టించి అన్నంత ప‌ని చేసింది.

వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట సుబ్బ‌య్య మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లా బ‌ద్వేలు ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్ నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అధికార వైసీపీ త‌మ అభ్య‌ర్థిగా వెంక‌ట సుబ్బ‌య్య భార్య సుధ‌ను ఎంపిక చేసింది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయ విలువ‌ల పాటించి ఎన్నిక ఏక‌గ్రీవం కావాల‌ని కోరుకుంటున్నామ‌ని అందుకే పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. చ‌నిపోయిన ఎమ్మెల్యే కుటుంబ స‌భ్యులు ఎన్నిక బ‌రిలో ఉంటే ఆ పోటీ నుంచి త‌ప్పుకునే సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తూ తాము కూడా దూరంగా ఉంటున్నామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెల్ల‌డించారు. దీంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం అయేలా క‌నిపించింది. కానీ బీజేపీ మాత్రం పోటీకి సై అంటోంది. అంతే కాకుండా త‌మ అభ్య‌ర్థి త‌ర‌పున పవ‌న్ కూడా ప్ర‌చారానికి వ‌స్తార‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

మ‌రోవైపు ఏపీలో మ‌స‌క‌బారిన కాంగ్రెస్ కూడా ఈ ఉప ఎన్నిక‌లో పోటీ ప‌డేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌భుత్వంపై పోరాటం కోసం ఈ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పోటీ చేస్తుంద‌ని పీసీసీ అధ్య‌క్షుడు శైల‌జానాథ్ ప్ర‌క‌టించాడు. ఇక ఇప్పుడు బీజేపీ త‌మ అభ్య‌ర్థిగా సురేశ్ పేరును ప్ర‌క‌టించి యువ‌త‌ను ఆక‌ట్టుకుని గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఫ‌లితాలు రాబ‌ట్టాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఎన్నిక‌లో వైసీపీ త‌ర‌పున సుధ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌కే అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు సాధించి ఏపీలో త‌మ ప‌ట్టు పెంచుకోవ‌డంతో పాటు ఉనికిని కాపాడుకోవాల‌నే ప్ర‌ణాళిక‌తో బీజేపీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో మూడు సార్లు బ‌ద్వేలు అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఎన్నిక‌లో (1994, 2009, 2019) బీజేపీ ఇక్క‌డ పోటీప‌డింది. ఒక్క శాతం కంటే ఎక్కువ ఓట్ల‌ను సొంతం చేసుకోలేక‌పోయింది.

బీజేపీ త‌ర‌పున బ‌రిలో దిగుతున్న క‌డ‌ప జిల్లాకు చెందిన యువ ద‌ళిత నేత సురేశ్ తొలి నుంచి సంఘ్ సంబంధిత సంస్థ‌ల్లోనే ప‌ని చేశారు. విద్యార్థులు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లి 86 రోజుల పాటు అక్క‌డ గ‌డిపారు. అఖిల భార‌తీయ విద్యార్థి ప‌రిష‌త్ (ఏబీవీపీ) జాతీయ కార్య‌ద‌ర్శిగా భార‌తీయ జ‌న‌తా యువ‌మోర్చా (బీజేవైఎం) జాతీయ కార్య‌ద‌ర్శిగానూ ప‌ని చేశారు. 2019 ఎన్నిక‌ల్లో రైల్వే కోడూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు ఆయ‌న‌కు 1,049 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. మ‌రోసారి బ‌ద్వేలు ఉప ఎన్నిక రూపంలో ఆయ‌న‌కు అవ‌కాశం వ‌చ్చంది. మ‌రి ఈ సారి ఆయ‌న ఎలాంటి ప్ర‌భావం చూపుతారోన‌న్న ఆస‌క్తి రేకెత్తుతోంది. ఎలాగో విజ‌యం ద‌క్క‌ద‌నే విష‌యం తెలిసిందే కాబ‌ట్టి ఏ మేర‌కు ఓట్లు రాబ‌డ‌తారో చూడాలి.