రవిబాబుకు ఆ హక్కుంది


చడీచప్పుడు లేకుండా వచ్చి ఒక చిన్న వీడియో రిలీజ్ చేసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పాల్గొనబోతున్న సభ్యుల్లో ఒక రకమైన ఆలోచన రేకెత్తించాడు నటుడు, దర్శకుడు రవిబాబు. అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే విషయంపై ఎన్నికల హడావుడి మొదలైన కొత్తలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కానీ.. ప్రకాష్ రాజ్‌తో పాటు నాగబాబు, బండ్ల గణేష్ లాంటి వాళ్లు ఈ విషయంలో ధాటిగా మాట్లాడి అలా అంటున్న వాళ్ల నోళ్లకు తాళాలు వేసేశారు.

ఐతే రవిబాబు మాత్రం చాలా తెలివిగా ఈ విషయంపై సభ్యుల్లో ఆలోచన రేకెత్తించాడు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో పరభాషా నటులు, టెక్నీషియన్ల ఆధిపత్యం గురించి ప్రస్తావించి.. మన సంఘాన్ని నడపడానికి కూడా పరాయి వ్యక్తి కావాలా అని ప్రశ్నించాడు. ఇక్కడ లోకల్-నాన్ లోకల్ అనే చర్చ లేదంటూనే ఆ చర్చనే లేవనెత్తాడు రవిబాబు. కాకపోతే చాలా లాజికల్‌గా ప్రశ్నలు వేయడం ద్వారా అతను సభ్యుల్లో అంతర్మథనానికి కారణమయ్యాడు.

ఐతే రాజీవ్ కనకాల కూడా ఇదే తరహాలో మాట్లాడ్డం గమనార్హం. మన ఇంటి పెత్తనాన్ని వేరేవాళ్లకు ఇస్తామా అని అతను ప్రశ్నించాడు. కానీ మలయాళీ అయిన సుమను పెళ్లి చేసుకున్న రాజీవ్.. ‘మా’ ఎన్నికల గురించి ఇలా ఎలా మాట్లాడతాడంటూ అతణ్ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. కానీ రవిబాబు విషయంలో మాత్రం ఏమీ అనడానికి లేకపోయింది. అతను చాలా లాజికల్‌గా మాట్లాడాడు. అలాగే తాను దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా వరకు తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లకే అవకాశాలు ఇచ్చాడు. మామూలుగా తెలుగు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంటే మన ఫిలిం మేకర్స్‌కు ఒక చిన్నచూపు. వాళ్లు తాము కోరుకున్న ఔట్ పుట్ ఇవ్వలేరన్న అభిప్రాయం ఉంటుంది.

కానీ రవిబాబు మాత్రం మన వాళ్లతోనే మంచి సినిమాలు అందించాడు. అతడి సినిమాలకు ఎక్కువగా ఛాయాగ్రహణం అందించింది సుధాకర్ రెడ్డి, సంగీతం సమకూర్చింది శేఖర్ చంద్ర. మిగతా వాళ్లు వీళ్ల ప్రతిభను సరిగా ఉపయోగించుకోలేదు. సుధాకర్ విషయానికి వస్తే.. అతను రవిబాబు ద్వారా వెలుగులోకి వచ్చి మరాఠీలో ‘సైరాఠ్’ సినిమా ద్వారా జాతీయ స్థాయిలో సత్తా చాటుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో సినిమా తీసి అనేక పురస్కారాలు పొందాడు. ఇలా తెలుగు వాళ్ల ప్రతిభకు పెద్ద పీట వేశాడు కాబట్టే రవిబాబు ఈ రోజు ధైర్యంగా ఆ వీడియో బైట్ ఇవ్వగలిగాడు. ఇలా మాట్లాడే హక్కు అతడికి పూర్తిగా ఉందనడంలో సందేహం లేదు.