కథ లేదు కానీ బాలయ్యతో సినిమా పక్కా..!

నందమూరి బాలకృష్ణ-బి.గోపాల్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు దర్శకుడు బి.గోపాల్. ఆయన తెరకెక్కిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో సినిమాను ప్రమోట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు బి.గోపాల్. ఇందులో భాగంగా బాలయ్యతో సినిమాపై స్పందించారు.

బాలయ్యతో త్వరలోనే సినిమా తీస్తానని చెప్పేశారు. మంచి కథ కోసం వెతుకుతున్నామని.. కొన్ని కథలు విన్నానని.. అయితే ఇప్పటివరకు ఏ కథను లాక్ చేయలేదని అన్నారు. త్వరలోనే కథ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటానని అన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగైదు సినిమాలు వచ్చాయి. అందులో ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ వంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి.

ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ లో సినిమా అనగానే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండే కథనే చేస్తారంటూ టాక్ నడుస్తోంది. బి.గోపాల్ కూడా సమరసింహారెడ్డి ఫ్యాక్షన్ కథా చిత్రాల్లో మైలు రాయి అని.. బాలయ్యతో మళ్లీ అలాంటి సినిమానే చేయాలనుంది అంటూ ముక్తాయించారు.

దీంతో అలాంటి కథతోనే సినిమా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే బాలయ్య చేతిలో చాలా సినిమాలున్నాయి. ప్రస్తుతం ‘అఖండ’ పూర్తి చేసిన ఆయన ఆ తరువాత గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో కలిసి పని చేయనున్నారు. మరి బి.గోపాల్ తో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి!