10 వేల కోట్ల అవకాశం వైసీపీ సర్కారు పోగొట్టుకోనుందా?

10 వేల కోట్లు. అక్ష‌రాలా.. ప‌ది వేల కోట్ల‌రూపాయ‌లు. ఈ నిధుల‌ను తిరిగి చెల్లించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కేంద్రం ఉచితంగా అందిస్తున్న భారీ నిధి! మ‌రి ఈ నిధులు మ‌న‌కు వ‌స్తాయా? అస‌లు కేంద్రం మ‌నల‌ను ప‌ట్టించుకుంటుందా? అంటే.. వైసీపీ స‌ర్కారు చేసిన నిర్వాకం కార‌ణంగా.. దీనిపై సందిగ్ధ ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక గొప్ప అవ‌కాశాన్ని వైసీపీ ప్ర‌భుత్వం చేజేతులా .. కూల‌దోసుకుంద‌ని.. పెద‌వి విరుస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. కేంద్ర ప్ర‌భుత్వం.. దేశ‌వ్యాప్తంగా ఉన్న ముఖ్య న‌గ‌రాలను అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించింది. దీనికి సంబంధించి ఆయా న‌గ‌రాల‌కు రూ.10 కోట్ల చొప్పున నిధులు ఇచ్చేందుకు రెడీ అయింది.

తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌ను కూడా ఈ న‌గ‌రాల జాబితాలో చేర్చ‌నున్న‌ట్టు తెలిసింది. దీనికి సంబంధించి కొన్ని రోజుల కింద‌ట‌.. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. కేంద్రానికి కొన్ని వివ‌రాలు కూడా పంపిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లోనూ 10 కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని.. హైద‌రాబాద్‌ను మ‌రింత అభివృద్ధి చేస్తున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. అమ‌రావ‌తి న‌గ‌రం అభివృద్ధి చేస్తే.. రాష్ట్రానికి తిరుగు ఉండ‌ద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. మ‌రి.. దీనిపై వైసీపీ స‌ర్కారు.. కేంద్రానికి ప్ర‌తిపాద‌న‌లు పంపించిందా? రూ.10 వేల కోట్లు మ‌న‌కు ల‌బిస్తాయా? అంటే.. అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కొత్త న‌గ‌రాల ఏర్పాటుకు సుముఖంగా ఉంది. 15 వ ఆర్థిక సంఘం సిఫార‌సుల మేర‌కు దేశంలోని 8 రాష్ట్రాల్లో 8 కొత్త న‌ర‌గాల‌కు రూ.10 వేల కోట్ల రూపాయ‌ల నిధులు కేటాయించాల‌ని నిర్ణ‌యించింది. ఈ సిఫార‌సు మేరకు కేంద్రం న‌గ‌రాల అభివృద్ధికి అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. అయితే, ఇప్పుడు ఆ 8 న‌గ‌రాల్లో అమ‌రావతి కూడా ఉంటుందా లేదా అన్న‌ది తెలియాల్సి ఉన్న‌ది. సుమారు 217 చ‌.కిమీ విస్తీర్ణంలో అన్ని ర‌కాల హంగుల‌తో రూ.40 వేల కోట్ల రూపాయ‌ల అంచ‌నాల‌తో అమ‌రావ‌తి న‌గ‌రాన్ని నిర్మించేందుకు గ‌త సీఎం చంద్ర‌బాబు ప్లాన్ చేశారు.

దీనిలో భాగంగా ఇప్ప‌టికే సుమారు రూ.10 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేసి కొన్ని బిల్డింగ్‌లు, రోడ్లు, ఇత‌ర మౌలిక వ‌స‌తులు ఏర్పాటు చేశారు. అయితే, గ‌త కొంత కాలంగా అమ‌రావ‌తి నిర్మాణం ఆగిపోయింది. ఇప్పుడు ఈ 8 న‌గ‌రాల్లో అమ‌రావ‌తి కూడా ఉంటే మ‌ళ్లీ న‌గ‌ర నిర్మాణం వేగం పుంజుకుంటుంది. ఆర్థిక సంస్థ‌లు నిథులు వెచ్చించేందుకు ముందుకు వ‌స్తాయి. ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు రోడ్లు, బిల్డింగ్‌లు, నీటి స‌ర‌ఫ‌రా, ప‌చ్చ‌ద‌నం వంటివి ఏర్పాటు చేయ‌డంతో కేంద్రం గ్రాంటుగా ఇచ్చే రూ.10 వేలతో రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఖ‌ర్చు చేసుకునే అవకాశం వ‌చ్చింది. అయితే.. అమ‌రావ‌తి అణిచి వేత కార్యక్ర‌మం ముమ్మ‌రంగా సాగుతున్న త‌రుణంలో.. వైసీపీ స‌ర్కారు ఈ నిధుల‌పై ప్ర‌తిపాద‌న‌లు పంపిందా? లే దా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.