రికార్డు మెజార్టీతో బంప‌ర్ విక్ట‌రీ కొట్టిన మ‌మ‌తా బెన‌ర్జీ


దేశవ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప‌శ్చిమ బెంగాల్ ఉప ఎన్నిక‌ల‌లో అధికార టీఎంసీ ఘ‌న‌విజ‌యం సాధించింది. కొద్ది నెల‌ల క్రితం అక్క‌డ జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో డ‌బుల్ సెంచ‌రీతో వ‌రుస‌గా మూడోసారి సీఎం పీఠం ద‌క్కించుకుంది మ‌మ‌తా బెన‌ర్జీ. అయితే మ‌మ‌త బంప‌ర్ మెజార్టీతో మూడోసారి బెంగాల్ సీఎం అయినా కూడా నందిగ్రామ్‌లో మాత్రం ఆమె సువేందు అధికారి చేతిలో 1700 స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ ప‌ట్టుబ‌ట్టి అక్క‌డ మ‌మ‌త‌ను ఓడించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డింది. రాష్ట్ర వ్యాప్తంగా మ‌మ‌త‌ను ట‌చ్ చేయ‌లేక‌పోయినా నందిగ్రామ్‌లో ఆమెను ఓడించ‌డం ద్వారా మాన‌సికంగా ఉప‌శ‌మ‌నం పొందింది.

ఇక బెంగాల్లో శాస‌న‌మండ‌లి లేక‌పోవ‌డంతో మ‌మ‌త ఖ‌చ్చితంగా ఆరు నెల‌ల్లో మ‌ళ్లీ ఎమ్మెల్యే అవ్వాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. లేక‌పోతే ఆమె సీఎం పీఠం నుంచి త‌ప్ప‌క దిగిపోవాలి. ఈ క్ర‌మంలోనే ఈ రోజు జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఆమె త‌న కంచుకోట అయిన భ‌వానీపూర్ నుంచి రికార్డు మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు. దీంతో ఆమె స‌గ‌ర్వంగా అసెంబ్లీ మెట్లు ఎక్క‌బోతున్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో ఆమె తొలి రౌండ్ నుంచే భారీ మెజార్టీతో దూసుకు పోయారు. ఆమె త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,389 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ సీపీఎం నుంచి శ్రీబిజి బిశ్వాస్ పోటీలో ఉన్నారు.

అయితే మ‌మ‌త ఎమ్మెల్యే అయ్యేందుకు భ‌వానీపూర్ నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో ఎమ్మెల్యేగా గెలిచిన శోభ‌న్‌దేవ్ ఛ‌టోపాధ్యాయ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. దీంతో మ‌మ‌త ఇక్క‌డ నుంచి పోటీ చేసి సునాయాస‌న విజ‌యం అందుకున్నారు. ఇక ఈ సీటు మ‌మ‌తే. గ‌తంలో ఆమె ఇక్క‌డ సాధించిన మెజార్టీని అధిగ‌మించి ఈ సారి ఏకంగా 58 వేల మెజార్టీ సొంతం చేసుకున్నారు. ఇక బెంగాల్లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జాంగీపూర్‌, శంషేర్ గంజ్ స్థానాల్లో బీజేపీ విజ‌యం సాధించింది.

ఇక్క‌డ నుంచి బీజేపీ లోక్‌స‌భ ఎంపీలుగా ఉన్న నేత‌లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అనంత‌రం వారు ఎంపీలుగా ఉండేందుకే ఇష్ట‌ప‌డి త‌మ ఎమ్మెల్యే ప‌ద‌విని వ‌దులుకున్నారు. దీంతో ఇక్క‌డ జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లోనూ టీఎంసీ భారీ విజ‌యం దిశ‌గా దూసుకుపోతూ బీజేపీకి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది.