సినిమా బంధమూ తెగినట్లేనా?


అక్కినేని నాగచైతన్య-సమంతలది ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ లవ్లీ పెయిర్. గత దశాబ్ద కాలంలో తెలుగులో మళ్లీ మళ్లీ తెరపై కనిపిస్తూ ప్రేక్షకులను ఇంతగా అలరించిన జంట మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. వ్యక్తిగత జీవితంలో ఒక్కటవడానికి ముందే వీరి జంట ప్రేక్షకులను కట్టి పడేసింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’ ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది. అందులో వీరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

సమంతకు తెలుగులో అదే తొలి సినిమా. అప్పటిదాకా చూసిన హీరోయిన్లకు భిన్నమైన లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సమంత తొలి చూపులోనే అందరినీ కట్టిపడేసింది. చైతూతో ఆమె కలిసి చేసిన ప్రతి సన్నివేశం ఒక మధుర జ్ఞాపకమే. ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ ఆమెనే. ఈ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయింది సామ్. చైతూ రేంజిని దాటిపోయినప్పటికీ సామ్.. తర్వాత కూడా చైతూతో కలిసి నటించింది.

‘ఆటోనగర్ సూర్య’ ఫ్లాప్ అయినప్పటికీ అందులో చైతూ-సామ్ జంట ఆకట్టుకుంది. ఇక ‘మనం’ గురించైతే చెప్పాల్సిన పని లేదు. పెళ్లి తర్వాత చేసిన ‘మజిలీ’ సైతం ఒక మరపురాని జ్ఞాపకమే. చై-సామ్ జంట మరింతగా ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిందీ సినిమాతో. ఇన్నిసార్లు కలిసి నటించినా ఈ జంట జనాలకు బోర్ కొట్టలేదు. మళ్లీ ఎప్పుడు వీళ్లిద్దరూ కలిసి నటిస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ జంట మధ్య విభేదాలు తలెత్తి విడాకులు తీసుకోవడంతో ఇక మళ్లీ వీరిని తెరపై జంటగా చూసే అవకాశం లేనట్లే.

కాలం ఎంత మారిపోయినా.. చైతూ, సామ్ ఎంత ప్రొఫెషనల్స్ అయినా.. వాళ్లిద్దరూ ఎంత పరిణతి చెందిన వ్యక్తులైనా సరే.. వివాహ బంధాన్ని తెంచుకున్నాక తిరిగి కలిసి నటించడానికి ముందుకు రాకపోవచ్చు. వారిని కలిపి చూపించాలనే ప్రయత్నం కూడా ఏ ఫిలిం మేకర్ కూడా చేయకపోవచ్చు. అసలు సినిమా అనే కాదు.. ఈ ఇద్దరూ ఏ రకంగానూ మళ్లీ కలిసి కనిపించే అవకాశం లేదనే భావించాలి.