కేసీఆర్-జగన్ : అడ్డుకోవ‌డంలో ఆంత‌ర్య‌మేంటో?

ఒక్కోసారి అధికారంలో ఉన్న ప్ర‌భుత్వాలు.. ప్ర‌త్య‌ర్థి పార్టీల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయో ఊహించ‌డం క‌ష్టం. అన‌వ‌స‌ర విష‌యాలపై ఎక్కువ దృష్టి సారించి ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌కు ఎక్కువ ప‌బ్లిసిటీ ఇవ్వ‌డంలో అధికార పార్టీలే కీల‌క పాత్ర పోషిస్తున్నాయ‌నే అభిప్రాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణాలు లేక‌పోలేదు. అటు ఏపీలో జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను జ‌గ‌న్ స‌ర్కారు.. ఇటు తెలంగాణ‌లో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్ర‌భుత్వం ఒకే రోజు అడ్డుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. త‌మ ప్ర‌త్య‌ర్థుల విష‌యంలో ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్ల ప‌రిస్థితి అధ్వానంగా మారింద‌ని.. ప్ర‌భుత్వం వాటిని బాగు చేయాల‌ని జ‌న‌సేన ఆ స‌మ‌స్య‌పై పోరాటం చేస్తోంది. అందులో భాగంగానే అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో శ్ర‌మ‌దానం చేసేందుకు ప‌వ‌న్ వెళ్లారు. ఆ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేదంటూ పోలీసులు నానా హంగామా చేశారు. కార్య‌క‌ర్త‌ల‌ను ఎక్క‌డిక్క‌డ అడ్డుకున్నారు. చివ‌ర‌కు ప‌వ‌న్ అన్ని అడ్డంకులు దాటి ఈ కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేశారు.

ఇటు తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై పోరాటానికి రాష్ట్ర కాంగ్రెస్ న‌డుం బిగించింది. అక్టోబ‌ర్ 2 నుంచి డిసెంబ‌ర్ 9 వ‌ర‌కు విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైర‌న్‌ను త‌ల‌పెట్టింది. అందులో భాగంగా గాంధీ జ‌యంతి రోజు తొలి కార్య‌క్ర‌మంగా దిల్‌సుఖ్‌న‌గ‌ర్ నుంచి ఎల్బీ న‌గ‌ర్ శ్రీకాంతిచారి చౌర‌స్తా వ‌ర‌కు ర్యాలీకి పిలుపునిచ్చింది. కానీ అనుమ‌తి లేదంటూ ఈ ర్యాలీకి పోలీసులు అడ్డుప‌డ్డారు. రేవంత్ రెడ్డిని ఆయ‌న ఇంటి ద‌గ్గ‌రే గృహ నిర్భంధం చేశారు. పార్టీ ముఖ్య నేత‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డే అడ్డుకుని ర్యాలీకి వెళ్ల‌కుండా చేశారు.

అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వాల వైఖ‌రిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్య‌ర్థుల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌య‌త్నించిన అధికార పార్టీల‌కే ఇప్పుడు ఎదురు దెబ్బ త‌గిలే వీలుంది. ఈ కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌కుండా ఆప‌డం ద్వారా ఆ నాయ‌కుల‌కు ప్ర‌భుత్వ‌మే కావాల్సినంత ప‌బ్లిసిటీ ఇచ్చిన‌ట్ల‌యింది. ఏపీలో జ‌గ‌న్ సైలెంట్‌గా ఉంటే ప‌వ‌న్ కార్య‌క్ర‌మానికి వెళ్లి త‌న ప‌ని పూర్తి చేసుకునేవారు. స‌భ‌లో అధికార ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసినా.. దానికి వైసీపీ నేత‌లు కౌంట‌ర్ ఇస్తే స‌రిపోయేది.

కానీ ఇప్పుడు ప‌వ‌న్ అడ్డుకోవ‌డం వ‌ల్ల జ‌గ‌న్‌కు ప‌వ‌న్ అంటే భ‌యం ఏర్ప‌డింద‌ని అందుకే ఇలా చేస్తున్నార‌ని జ‌న‌సేన ప్ర‌చారం చేసుకోవ‌డానికి అవ‌కాశం దొరికింది. ప్ర‌జ‌లు కూడా ఇదే విధంగా ఆలోచించే వీలుంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వంలో చంద్ర‌బాబు కూడా ఇలాగే జ‌గ‌న్‌ను చాలా సార్లు అడ్డుకున్నారు. ఫ‌లితం.. గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీ జ‌గ‌న్ చేతిలో చావుదెబ్బ తిన్నది. అది తెలుసుకోలేని జ‌గ‌న్ మ‌ళ్లీ బాబు చేసిన త‌ప్పే చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత రేవంత్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. స‌భ‌లు ర్యాలీలు విమ‌ర్శ‌లు ఆరోప‌ణ‌ల‌తో కేసీఆర్‌కు కొర‌క‌రాని కొయ్య‌లా మారారు. తాజాగా నిరుద్యోగుల కోసం పోరాడాల‌ని నిర్ణ‌యించారు. అందుకే ర్యాలీకి పిలుపునిచ్చారు. కానీ ఈ ర్యాలీని బ‌ల‌వంతంగా పోలీసులు అడ్డుకోవ‌డం ఇప్పుడు రేవంత్‌కే మేలు చేసే అవ‌కాశం ఉంది. రేవంత్ అంటే ఇప్ప‌టికే కేసీఆర్‌లో భ‌యం ఉంద‌ని టాక్‌. తాజా ప‌రిణామంతో అది స్ప‌ష్ట‌మైంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అదీ కాకుండా కాంగ్రెస్ నేత‌ల‌ను అడ్డుకోవ‌డం కోసం వందల సంఖ్య‌లో పోలీసుల‌ను వాడుకోవ‌డం దిల్‌సుఖ్‌న‌గ‌ర్ మెట్రో స్టేష‌న్ మూసేసి ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లిగించ‌డం వ‌ల్ల కేసీఆర్‌పై మ‌రింత వ్య‌తిరేక‌త పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల నిర‌స‌న‌లు స‌భ‌లు ర్యాలీలు లాంటికి అధికార ప్ర‌భుత్వాలు అనుమ‌తి ఇవ్వాలి. ప‌రిస్థితి శ్రుతిమించితే అప్పుడు కొర‌డా ఝుళిపించాలి. అంతే కానీ ఇలా ముందుగానే అడ్డుకోవ‌డం స‌రికాద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.