ఆనంకు వచ్చే ఎన్నికల్లో అనుమానమే

సీనియర్ నేత, మాజీమంత్రి, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డి వ్యవహారం పార్టీలో పెద్ద తలనొప్పిగా తయారైంది. గతకాలపు తన వైభవాన్ని తలచుకుంటు ప్రస్తుతం తనను ఎవరు లెక్కచేయటం లేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారు. దాంతో అధికారులపైన, మంత్రులు, సహచర ఎంఎల్ఏలపై రెగ్యులర్ గా ఏదోఒక వ్యాఖ్యలు చేస్తునే ఉన్నారు. తానుచేసే వ్యాఖ్యలు ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చేటు తెస్తాయన్న విషయం బాగాతెలిసి కూడా తన పద్దతిని మార్చుకోవటంలేదు.

అంటే ఏదోరకంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందిపెట్టడమే టార్గెట్ గా వ్యవహరిస్తున్నారని అర్ధమవుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రామనారాయణరెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఇదే పద్దతిలో ఉంటారు. ఎవరైనా సరే తన ఆధిపత్యాన్ని ఆమోదించాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కాంగ్రెస్ లో ఉన్న పదేళ్ళు మంత్రిగా బ్రహ్మాండంగా వెలిగారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర విభజన జరగింది. దాంతో ఆనం తన ప్రాభవాన్ని కోల్పోయారు. అప్పటినుండి పూర్వవైభవాన్ని పొందేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అది కుదరకపోవటంతోనే నిత్య అసంతృప్తిగా మారుతున్నారు.

2014 ఎన్నికల తర్వాత ఆనం సోదరులు అంటే రామనారాయణరెడ్డితో పాటు వివేకానందరెడ్డి కూడా టీడీపీలో చేరారు. టీడీపీలో ఉన్నపుడు కూడా తన మాటే చెల్లుబాటు కావాలని చాలా ప్రయత్నాలే చేశారు. అది సాధ్యం కాకపోవటంతో అక్కడ ఇమడలేక వైసీపీలో చేరటానికి ప్రయత్నాలు చేసుకున్నారు. అయితే సోదరుల వ్యవహారం అందరికీ తెలిసిందే కాబట్టి అప్పటి వైసీపీ ఎంఎల్ఏలు ఆనం సోదరులను పార్టీలో చేర్చుకోవటానికి ఇష్టపడలేదు. తర్వాత వివేకానందరెడ్డి మరణించటంతో రామనారాయణరెడ్డి టీడీపీకి దూరంగా జరిగారు.

అలాంటి పరిస్ధితుల్లో మళ్ళీ తాను వైసీపీలో చేరటానికి ప్రయత్నాలు చేసుకన్నారు. అప్పటికే రామనారాయణరెడ్డి ఒంటరైపోవటంతో వైసీపీ ఎంఎల్ఏల్లో సింపతి పెరగటంతో ఆనం చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో జగన్ కూడా ఓకే అనటంతో రామనారాయణరెడ్డి వైసీపీలో చేరిపోయారు. మొన్నటి ఎన్నికల్లో నియోజకవర్గం విషయంలో రకరకాల ప్రయత్నాలు చేసినా చివరకు జగన్ చెప్పినట్లుగా వెంకటగిరిలో పోటీచేసి గెలిచారు. గెలవగానే మంత్రిపదవి కోసం ప్రయత్నాలు చేశారు.

తాను ఆశించిన మంత్రి పదవి దక్కకపోవటంతో పాటు తనకన్నా చాలా జూనియర్లయిన అనీల్ కమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కటాన్ని తట్టుకోలేకపోయారు. ఇద్దరు మంత్రులున్నా తన మాటే చెల్లుబాట కావాలన్న పట్టుదలతో వాళ్ళనే శాసించేందుకు ప్రయత్నించారు. అందుకు వాళ్ళు అవకాశం ఇవ్వకపోవటంతో గొడవలు మొదలైపోయాయి. రెగ్యులర్ గా మంత్రులు, ఉన్నతాధికారులను టార్గెట్ చేస్తు ఏదోక ఆరోపణలు చేస్తునే ఉన్నారు.

పార్టీలో చేర్చుకునేంతవరకు బతిమలాడుకుని తీరా చేర్చుకుని, టికెట్ తీసుకుని గెలిచిన తర్వాత ఆనం వ్యవహారం పూర్తిగా మారిపోవటాన్ని జగన్ గమనిస్తున్నారట. అసలు ఆనంను పార్టీలో చేర్చుకున్నదే చాలా ఎక్కువ. అలాంటి ఆనం వ్యవహారశైలితో జగన్ కూడా బాగా విసిగిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవాలు గ్రహించి తన పద్దతిని మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ఆనంకు టికెట్ అనుమానమే అంటున్నారు. మరి ఆనం ఏమి చేస్తారో చూడాల్సిందే.