వైసీపీ నేత‌ల్లో క‌ట్ట‌లు తెగిన‌ అస‌హ‌నం… ఆపినా ఆగ‌రా ?


ఒక‌రిలో ఆగ్ర‌హం వ‌స్తే.. స‌రే.. ఏదైనా లోపం జ‌రిగి ఉంటుద‌ని అనుకోవ‌చ్చు. కానీ, ఒక‌రు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అస‌హ‌నంతో ర‌గిలిపోతున్నారు. దీంతో ఇప్పుడు వారిని స‌ర్దుబాటు చేయ‌డం.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డం వంటివి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. నెల్లూరు జిల్లా నుంచి అనంత‌పురం వ‌ర‌కు చాలా మంది ఎమ్మెల్యేలు.. ప‌నులు జ‌ర‌గ‌డం లేద‌ని.. నిధులు ఇవ్వ‌డం లేద‌ని.. ర‌గిలిపోతున్నారు. తాజాగా నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఆనం రామనారాయ‌ణ రెడ్డి ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు.

ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌భుత్వ వైఖ‌రిని బ‌హిరంగంగానే దుయ్య‌బ‌ట్టారు. చేసిన‌పనులకు ఇంకా నిధులు ఇవ్వ‌లేద‌ని.. మ‌రోసారి కొత్త‌గా ప‌నులు ఎలా ప్రారంభిస్తామ‌ని.. అధికారులపై ఒత్తిడి తీసుకువ‌స్తే.. వాళ్లు మాత్రం ఎలా ప‌నులు చేస్తార‌ని.. ప్ర‌శ్నించారు. స‌రే.. ఆనం వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ఎప్పటి నుంచో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, మ‌రో నాయ‌కుడు.. జ‌గ‌న్‌కు అత్యంత వీర విధేయుడుగా ఉన్న నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి కూడా ఇదే రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు.

గ‌డిచిన ఏడాది కాలంగా.. నిధులు ఇవ‌వ్వ‌డం లేద‌ని.. త‌ననియోజ‌క‌వ‌ర్గంలో చేసిన ప‌నుల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి కోట్ల రూపాయ‌లు రావాల్సి ఉంద‌ని.. అవి ఇవ్వ‌కుండా.. కొత్త‌గా ప‌నులు చేప‌ట్టాలంటే.. ఎవ‌రు మాత్రం ముందుకు వ‌స్తార‌ని .. ఆయ‌న ప్ర‌శ్నించారు. అస‌లు కాంట్రాక్ట‌ర్లు కూడా ప‌నులు చేసేందుకు ముందుకు రావ‌డం లేద‌ని.. ఈ విష‌యాన్ని పెద్ద‌లు ఆలోచించుకోవాల‌ని చెప్పారు. గుంటూరు జిల్లాకు చెందిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా గ‌తంలో అధికారులు అస్స‌లు మాట విన‌డం లేద‌ని.. ఇలా అయితే తాము అధికారంలో ఉండి కూడా ఎలా త‌లెత్తుకుని తిరుగుతామ‌ని ప్ర‌శ్నించారు.

ఇక‌, అనంత‌పురంలోనూ కొన్ని రోజుల కింద‌ట ఇలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. ఈ ప‌రిణామాలు చూస్తే.. నిజంగానే ప్ర‌భుత్వం నుంచి నిధులు ఆగిన‌ప్ప‌టికీ.. మేనేజ్ చేసుకునే స‌త్తా ఎమ్మెల్యేల‌కు లేదా? అనేది ప్ర‌శ్న‌. కానీ.. వారి అస‌హ‌నం వేరే ఉంద‌ని.. త‌మ‌కు ప్ర‌భుత్వం నుంచి జ‌గ‌న్ నుంచి కూడా గుర్తింపు ఉండ‌డం లేద‌ని.. వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని.. అందుకే ఇలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇలాంటి వారిని స‌ర్దుబాటు చేయ‌డం జ‌గ‌న్‌కు క‌ష్ట‌మేన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.