2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదు: కేశినేని నాని

టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతలో ఉన్నారని, అందువల్ల ఇక నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని, స్వయంగా అధినేత చంద్రబాబుతోనే చెప్పారని ఇటీవల విస్తృతంగా ప్రచారం జరిగింది. పార్టీ పట్ల కేశినేని ఎందుకు విరక్తి చెందారని, దానికి కారణం.. అధిష్టానమేనని ఆయన సన్నిహితులు ఇప్పటివరకు చెప్పిన మాట. కేశినేని నిర్ణయంతో ఆయన అనుచరులు తీవ్రంగా బాధపడ్డారంట. కేశినేని తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయనని కేశినేని స్పష్టం చేయడం.. లేదు లేదు.. మీరు ఎన్నికల్లో నిలబడాలని పార్టీ కార్యకర్తలు పట్టుబట్టడం జరుగుతూ వస్తోందని వార్తలు వచ్చాయి. ఇంత గందరగోళం జరుగుతున్నా టీడీపీ అధిష్టానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని మీడియా కథనాలు వెలువడ్డాయి. అయితే వీటన్నిటికి చెక్ పెడుతూ ఎట్టకేలకు కేశినేని తన రాజకీయ భవితవ్యంపై ఆయనే స్పష్టత ఇచ్చారు.

2024లో పోటీ చేయనని ఎవరితోనూ అనలేదని కేశినేని కొట్టి పారేశారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని అభయం ఇచ్చారు. తాను పోటీ చేయనని అధినేతతో చెప్పలేదని, పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించాలని అధినేత చంద్రబాబుతో దృష్టికి తెచ్చానని వివరించారు. దుర్గమ్మ ఆశీస్సులు ఉన్నంతకాలం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారానికి నాని తెరదించారు. కేశినేని ప్రకటనతో ఆయన సన్నిహితులు ఖుషీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో అభిమానులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

కేశినేని ఎంపీగా గెలిచినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా లేరు. గత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత బీజేపీ నేత‌ల‌తో నాని వ‌రుస‌గా భేటీ అయ్యారనే ప్రచారం జరిగింది. కేంద్ర ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్కరీని ఆయ‌న క‌లిశారు. గ‌డ్క‌రీతో ఉన్న అనుబంధం గురించి ట్వీట్ చేశారు. ఆయ‌న స‌హ‌కారంతో ప‌లు ప్రాజెక్టుల‌ను ముందుకు తీసుకుపోయినట్లు చెప్పారు. ఇక అందరూ కేశినేని బీజేపీలో చేరడం ఖాయమని డిసైడ్ అయ్యారు కూడా. ఆయన బీజేపీలో నేతల టచ్‌లో ఉన్నారని, ఇక బీజేపీ చేరడం ఖాయమనే ప్రచారం కూడా జరిగింది. అయితే, అది టీ కప్పులో తుఫానులో సమసిపోయింది.

అయితే కేశినేని మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇంతలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. నాని కుమార్తె శ్వేతను మేయర్‌ అభ్యర్థిగా ప్రచారం చేయడం, ఆ తర్వాత ఆమెను మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించడంపై పార్టీలోని బుద్దా వెంకన్న, బొండా ఉమ వంటి వారిలో అసంతృప్తిని రేకెత్తించింది. నానికి సన్నిహితుడిగా ఉన్న పట్టాభి, నాగుల్‌ మీరా వంటి వారు ఆయనకు దూరమయ్యారు. కేశినేని నాని, బుద్దా వర్గం మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో హైకమాండ్‌ వ్యవహరించిన తీరుపట్ల నాని అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

విలేకరుల సమావేశం పెట్టి మరీ తనపై విమర్శలు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదనే అసంతృప్తిని నాని పలుమార్లు అధిష్ఠానం వద్దే వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ కారణంగానే తన అసంతృప్తిని అధిష్ఠానం వద్ద వెళ్లగక్కి, ఇకపై పోటీ చేయబోనని తెలిపినట్లు చెబుతున్నారు. ఈ లోపే నాని తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చర్చకు దారి తీస్తోంది. చాలా సందర్భాల్లో నాని ఇలాగే వ్యవహరిస్తూ వస్తున్నారని కొన్ని సార్లు పార్టీని భయపెట్టేందుకు ఇలా వ్యవహరిస్తూ ఉంటారని టీడీపీలోని ఓ వర్గం ఆరోపిస్తోంది. నాని నిర్ణయం తాత్కాలికమేనని ఆయన ఎప్పుడో ఓసారి తిరుగుబాటు జెండా ఎగురవేయం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది.