అధికారుల అత్యుత్సాహం.. ఇర‌కాటంలో ఏపీ స‌ర్కార్‌

అధికారుల అత్యుత్సాహం.. కొన్ని సంద‌ర్భాల్లో.. నిర్ల‌క్ష్యం మ‌రికొన్ని సంద‌ర్భాల్లో… ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వానికి ప్రాణ‌సంక‌టంగా ప‌రిణ‌మించింది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ద‌గ్గ‌ర మార్కులు కొట్టేసే ప‌నిలో తీరిక లేకుండా ఉన్న అధికారులు ‘కొంద‌రు’ చేస్తున్న ప‌నులు.. ప్ర‌భుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారాయి. తాజాగా ఒకే రోజు గురువారం జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌ల‌ను ప‌రిశీలిస్తే.. అధికారుల నిర్ల‌క్ష్యం, అత్యుత్సాహం రెండూ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. రాష్ట్రంలో రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలోని వారికి ఇచ్చే క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల వ్య‌వ‌హారం .. ఇప్పుడు హైకోర్టుకు చేరింది.

ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలపై సీఎం జ‌గ‌న్ ఫొటోను ముద్రించారు. ఇది కొన్నాళ్ల కింద‌టే వివాదం అయింది. దీంతో స్వ‌యంగా జ‌గ‌నే.. స‌ద‌రు ఫొటోల‌ను తొల‌గించాల‌ని.. నీలం సాహ్ని.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న‌ప్పుడే చెప్పారు. అయితే.. ఎందుకో.. స్వామి భ‌క్తి ప్ర‌ద‌ర్శ‌న‌లో మునిగి తేలుతున్న రెవెన్యూ ఉన్న‌తాధికారులు దీనిని ప‌ట్టించుకోలేదు. అయితే.. ఇప్పుడు ఇదే విష‌యంపై హైకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. ధ్రువీకరణ పత్రాలపై సీఎం ఫొటో ముద్రించ‌డం చట్ట విరుద్ధమని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన జడ రవీంద్రబాబు పిటిషన్‌ వేశారు.

రాజకీయ నాయకుల ఫొటోల ముద్రణ సుప్రీం తీర్పునకు విరుద్ధమని పిటిషనర్‌ పేర్కొన్నారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ అభ్యంతరాలను అధికారులకు తెలియజేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరాలు వారంలో రాతపూర్వకంగా తెలియ జేయాలని పేర్కొంది. సీఎం ముఖ‌చిత్రం ముద్రణపై 6 వారాల్లో అధికారులు నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయితే.. ఈ విష‌యంలో సీఎంవో త‌ప్పు ఏమాత్రం లేద‌ని.. వైసీపీ నాయ‌కులు అంటున్నారు. ఇది పూర్తిగా అధికారుల అత్యుత్సాహ‌మేన‌ని చెబుతున్నారు.

ఇదిలావుంటే.. గుర‌వార‌మే ఓ వ‌ర్గం మీడియాలో వ‌చ్చిన క‌థ‌నం కూడా ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. దీనిలోనూ సీఎం జ‌గ‌న్ పాత్ర కానీ, మంత్రుల ప్ర‌మేయం కానీ లేదు. కేవ‌లం.. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా.. ప్ర‌భుత్వం ప‌రువు పోయిన‌ట్టు అయింది. కేంద్రం ఆదేశాల మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న భూముల‌ స‌మ‌గ్ర స‌ర్వేలో భాగంగా.. విధి విధానాలు రూపొందించేందుకు రెవెన్యూ అధికారులు.. చేసిన నిర్ల‌క్ష్యం.. ప్ర‌భుత్వంపై మ‌ర‌క‌లు ప‌డేలా చేసింది. ఇత‌ర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి.. ఏం చేస్తున్నార‌నే విష‌యాన్ని అధికారులు ప‌రిశీలించారు.

ఇంత వ‌ర‌కు ఎవ‌రైనా చేసేదే. అయితే.. ఇక్క‌డే అధికారుల నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. ఎక్క‌డో ఉన్న ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో అమ‌లైన విధానాన్ని ఏ-జ‌డ్ కాపీ కొట్టారు. ఇది ఇప్పుడు ఏపీ స‌ర్కారుపై ఓ వ‌ర్గం మీడియా దుమ్మెత్తిపోసేలా చేసింది. నిజానికి దీనిలో ఏపీ సీఎం పాత్ర లేకున్నా.. ఆయ‌న మాత్రం నింద‌లు మోయాల్సి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇది ఎవ‌రి త‌ప్పు..? అనేది లోతుగా ఆలోచించాల‌ని అంటున్నారు సీనియ‌ర్లు. అధికారుల అత్యుత్సాహానికే కాదు..నిర్ల‌క్ష్యానికి కూడా బ్రేకులు వేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.