టీడీపీ ఎంపి గల్లా కుటుంబంపై కేసు

తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ పై పోలీసులు కేసు నమోదుచేశారు. భూ ఆక్రమణ వివాదంలో రైతు ఫిర్యాదును పరిశీలించిన కోర్టు ఎంపితో పాటు ఆయన తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, తండ్రి గల్లా రామచంద్రనాయుడుపైన కేసులు నమోదు చేయాలని ఆదేశించటంతో పోలీసులు వెంటనే పై ముగ్గురితో పాటు మరో 10 మందిపైన కేసులు నమోదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గల్లా అరుణకుమారి తండ్రి, మాజీ ఎంపి రాజగాలనాయుడు పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటుచేశారు.

వాళ్ళ సొంత గ్రామమైన దిగువమాఘంలో ట్రస్టుపేరుతో భవనాలు నిర్మించారు. ఈ భవనాల కోసం కాంపౌండ్ వాలును కూడా నిర్మించారు. అయితే ఈ భవనాలకు సమీపంలోనే ఉన్న మరో రైతు గోపీకృష్ణ భూములకు కూడా కలిపి గల్లా కుటుంబం కాంపౌండ్ కట్టేసుకున్నది. తన భూములను కాంపౌండ్ లో కలిపేసుకున్న విషయాన్ని గ్రహించిన రైతు 2015 నుండి గల్లా కుటుంబంతో మాట్లాడుతునే ఉన్నారు. ఎన్నిసార్లు మాట్లాడిన గల్లా కుటుంబం స్పందించకపోవటంతో చేసేది లేక చివరకు చిత్తూరులోని నాలుగో అదనపు ఫస్ట్ క్లాన్ మెజిస్ట్రేట్ లో కేసు వేశారు.

రైతు పిటీషన్ను పరిశీలించిన కోర్టు వెంటనే బాధ్యులపై కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు పై ముగ్గురితో పాటు కోడలు గల్లా పద్మావతి, కూతురు గోగినేని రమాదేవి, ట్రస్టు కార్యదర్శి సీ. రామచంద్రరాజు, ఉద్యోగులు ఎం పార్ధసారధి, భక్తవత్సలనాయుడు, ఎం మోహన్ బాబు, న్యాయవాది చంద్రశేఖర్, సర్పంచ్, కార్యదర్శిపైన కూడా కేసులు నమోదుచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈమధ్య తరచూ గల్లా కుటుంబంపై ఆరోపణలు పెరిగిపోతున్నాయి. చిత్తూరులోని అమరరాజా యూనిట్ కు కూడా ప్రభుత్వం కేటాయించిన స్ధలం కన్నా అదనంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటు రెవిన్యు అధికారులు కేసులు నమోదుచేశారు. అలాగే యూనిట్ పై వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందని మరో కేసు నమోదైంది. మొత్తానికి గల్లా కుటుంబాన్ని ఒకదాని తర్వాత మరో కేసు తగులుకుంటోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.