ఎంపీ, ఎంఎల్ఏ కి జగన్ క్లాస్ ?

వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎంఎల్ఏ జక్కంపూడి రాజా మధ్య విభేదాలు చాలా తీవ్రస్థాయికి చేరుకున్నాయి. విచిత్రమేమిటంటే ఒకరిపై మరొకరు చేసుకున్న ఆరోపణల్లో రెండు ఒకేలా ఉన్నాయి. రైతుల భూములను సేకరించి ప్రభుత్వం దగ్గరనుండి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తామని ఒప్పందాలు చేసుకుని భారీ అవినీతికి పాల్పడ్డారనేది బాటమ్ లైన్.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇద్దరు కూడా ఒకే రకమైన ఆరోపణలను ఒకరిపై మరొకరు చేసుకుంటున్నారు. అంటే వీళ్ళ ఆరోపణలు కనుక నిజమే అయితే ఇద్దరు అవినీతికి పాల్పడినట్లే అనుకోవాలి. మరి ఇద్దరు ఒకేరకమైన అవినీతికి పాల్పడినట్లు మీడియా సమావేశాల్లోనే ఆరోపణలు చేసుకుని పార్టీ పరువును రోడ్డున ఎందుకు పడేస్తున్నారన్నదే అర్థం కావడం లేదు. వ్యక్తిగతంగా తాము డ్యామేజి అవటమే కాకుండా పార్టీ పరంగా కూడా జనాల్లో పలుచన అవుతోందన్న విషయాన్ని వీరిద్దరు మరచిపోయారు.

ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇందులో భాగంగానే జిల్లా పార్టీ ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఇద్దరు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇద్దరితోనూ చర్చించిన సుబ్బారెడ్డి ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకు చెప్పారు. అయినా ఇద్దరూ తమ తమ వాదనలకే కట్టుబడ్డారు. దాంతో లాభం లేదని విషయాన్ని జగన్ కు వివరించారు సుబ్బారెడ్డి. దాంతో సీన్ జగన్ ముందుకు చేరింది. ఇద్దరినీ తీసుకుని సుబ్బారెడ్డి జగన్ను కలిశారు.

అక్కడ ఇద్దరికీ సీఎం ఫుల్లుగా క్లాస్ పీకారు. బహిరంగంగా చేస్తున్న ఆరోపణలు మరోసారి చేసుకుంటే అంగీకరించేది లేదని స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. ఇద్దరి మధ్య గొడవల్లో పార్టీ పరువు బజార్లో పడేస్తానంటే అంగీకరించేది లేదని స్పష్టంగా చెప్పారట. ఎవరికి వారుగా వ్యవహరిస్తామంటే కుదరదని కలసికట్టుగా పనిచేయాల్సిందే అని హెచ్చరించారు. ఇదే పరిస్థితి మళ్ళీ రిపీట్ అయితే ఇక రెండోసారి చెప్పేదేమీ ఉండదని తీవ్రంగానే వార్నింగ్ ఇచ్చారు.

ఇద్దరు ఇంకోసారి గొడవలు పడితే నచ్చ చెప్పడాలు, మధ్యస్ధాలు చేయటం ఉండదన్నారు. పరిస్థితి అంతదాకా వస్తే పరిణామాలు డిఫరెంట్ గా ఉంటుందని చెప్పారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి వివాదమే గతంలో నెల్లూరు జిల్లాలోని ఇద్దరు ఎంఎల్ఏల మధ్య జరిగింది. అప్పుడు కూడా జిల్లా స్థాయిలోనే వివాదాన్ని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాధ్యం కాకపోవటంతో జగన్ ముందుకొచ్చింది పంచాయితి.

అప్పుడు కూడా జగన్ ఇదే పద్ధతిలో సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే పార్టీ కోసం ఇద్దరినీ వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టంగా చెప్పారు. తనకు ఇద్దరూ సన్నిహితులే కాబట్టి ఏ ఒక్కరికి మద్దతుగా మాట్లాడేందుకు సాధ్యం కాదన్నారు. అందుకనే పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇద్దరి మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చేసిన హెచ్చరికలతో మళ్ళీ వాళ్ళిద్దరు ఎంఎల్ఏలు నోరిప్పలేదు. అలాంటి వార్నింగే ఇపుడు కూడా జగన్ ఇచ్చారు. మరి ఆ క్లాస్ ఎంతవరకు పని చేస్తుందో చూడాల్సిందే.