వంగవీటి రాధా – మరీ ఇంత గందరగోళమా ?

సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉంటూ కూడా భవిష్యత్తుపై ఏమాత్రం అంచనాలు వేయలేని నేత ఎవరనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ @ రాధా అనే చెప్పాలి. ప్రతి ఎన్నికకు పార్టీ మారటం అని కూడా ఓడిపోయే పార్టీలో చేరటం. ఇలాంటి పరిస్థితి రాధాకు ఎందుకు వస్తోందంటే భవిష్యత్ రాజకీయాలు సరిగా అంచనా చేయలేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. చాలామంది నేతలకు దొరకని బ్రహ్మాండమైన ప్లాట్ ఫామ్ రాధాకు దొరికింది. అయితే మాత్రం ఏం ? అన్నట్లుగా ఉంది ఆయన రాజకీయ ప్రయాణం.

ఒకపుడు కృష్ణా జిల్లాలో ప్రత్యేకించి విజయవాడ రాజకీయాల్లో+రాష్ట్రవ్యాప్తంగా కాపుల్లో వంగవీటి మోహన రంగా అంటే తెలీని వారుండరు. క్లుప్తంగా రంగా అనే పేరుతో ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటి రంగ వారుసునిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన రాధా ప్రయాణం అంతా గతుకులే. నిజానికి రంగా కొడుకుగా రాధాకు విజయవాడ రాజకీయాల్లో తిరుగనేదే ఉండకూడదు. విజయవాడలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడ పోటీ చేసినా గెలుపు గ్యారంటీ అని జనాలు చెప్పుకోవాలి.

అలాంటి పరిస్థితి నుంచి పార్టీలు అసలు టికెట్లే నిరాకరించే పరిస్థితికి రాధా గ్రాఫ్ దిగజారిపోయింది. ఇది కేవలం రాధా స్వయంకృతం తప్ప మరోటి కాదని అందరికీ తెలిసిందే. తాను పోటీ చేయదలచుకున్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో టికెట్ కోసం అధినేతలను బతిమలాడుకునే పరిస్థితికి చేరుకున్నారు. ఇపుడు రాధా ఏ పార్టీలో ఉన్నారంటే మామూలు జనాలు చెప్పలేరు. నిజానికి ఆయన టీడీపీలోనే ఉన్నారు. కానీ యాక్టివ్ గా మాత్రం లేరు.

అలాంటిది ఈ మధ్యనే విజయవాడను వదలిపెట్టి గుడివాడలో తిరుగుతున్నారట. కాబట్టి వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థి రాధానే అని టీడీపీలో ప్రచారం పెరిగిపోయింది. అయితే హఠాత్తుగా ఆదివారం గుడివాడలో జరిగిన ఓ ఫంక్షన్లో మంత్రి కొడాలి నానితో రాధా భేటీ అయ్యారట. ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఫంక్షన్లో కలుసుకుని మాట్లాడుకున్నారని సమాచారం. నిజానికి చాలా కాలంగా వీరిద్దరు మంచి ఫ్రెండ్సే. పార్టీలు వేరవ్వటం వల్ల గ్యాప్ వచ్చేసింది.

తాజా భేటీ విషయం ఏమిటంటే రాధా మళ్ళీ వైసీపీలో చేరబోతున్నారట. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి మళ్ళీ వైసీపీలోకి చేరేట్లుగా ఏర్పాట్లు చేస్తానని రాధాకు మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పైగా రాధాకు ఎంఎల్సీ ఇప్పించేట్లుగా తాను జగన్ను ఒప్పిస్తానని కూడా మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజమన్నది వాళ్ళిద్దరికే తెలియాలి. ఇదంతా చూస్తుంటే రాధాలోని కన్ఫ్యూజన్ స్పష్టంగా కనబడుతోంది. ఏ పార్టీకి లాయల్ గా ఉండకుండా ఏ అధినేతకు విశ్వాసంగా ఉండకపోతే రాజకీయ భవిష్యత్తు ఎలాగుంటుందో రాధాకే తెలియాలి.