వేడెక్కుతోన్న బెజవాడ టీడీపీ రాజకీయం.. కేశినేని నాని పై ఒత్తిడి

బెజవాడ టీడీపీలో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయనని అధినేత చంద్రబాబుతో కేశినేని నాని స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. కేశినేని అభిమానులు, కార్యకర్తలు మాత్రం 2024 లో కూడా ఎంపీగా పోటీ చేయాలని కేశినేని నానిపై ఒత్తిడి పెడుతున్నారు. బెజవాడలోని మూడు నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు కేశినేని ఇంటికి చేరుకుంటున్నారు. బెజవాడలో దుర్గమ్మ ఉన్నంత వరకు.. కేశినేని భవన్ ఉంటుందని కేశినేని నాని స్పష్టం చేశారు. ఆయన మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. ఆయన మాటల వెనుక వైరాగ్యం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇంతకీ నానికి ఏమైంది. వైసీపీ హవాలో కూడా ఆయన ఎంపీగా గెలిచారు. వైసీపీ సునామీని తట్టుకుని నిలబడ్డ ఆయన ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయనని భీష్మించుకు కూర్చున్నారు. కార్యకర్తల మనోభావాన్ని గౌరవించి ఎన్నికల్లో పోటీ చేసిన స్థానిక నేతలు ఆయన సహకరించే పరిస్థితి కనిపించడంలేదనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో స్థానిక నేతలంతా ఒకవైపు… నాని ఒకవైపు నిలిచారు. ఎలాగోలా టీడీపీ అధిష్టానం ఇరువర్గాలను శాంతింపజేసినప్పటికీ.. ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది.

అప్పటి ఘటనలతో మనస్థాపం చెందిన కేశినేని… మరోసారి అసంతృప్తి గళాన్ని వినిపిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీ అధిష్టానంపై గతంలో పలుమార్లు అసహనాన్ని వ్యక్తం చేసిన నాని, కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కుమార్తె, 11వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ కేశినేని శ్వేత కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. కొద్ది రోజుల క్రితం పార్టీ అధినేత చంద్రబాబును కలిసిన నాని.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఒకప్పుడు బెజవాడ టీడీపీలో ఉన్న గ్రూపులను నాని ఎంట్రీతో చెక్ పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. టీం టీడీపీ పేరుతో అన్ని వర్గాలను ఏకం చేసిన నాని.. నేడు పార్టీలో గ్రూపులు ఏర్పడటానికి కారణమవుతున్నారని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా నాని కార్యకర్తల కోరిక మేరకు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటారా లేక.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని భీష్మించుకుంటారా అనే తేలాల్సి ఉంది.

నాని విషయంలో ఇంత ప్రచారం జరుగుతున్న ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కానీ.. పార్టీ అధినేత చంద్రబాబు కానీ ఇంతవరకు స్పందించపోవడానికి కారణం ఏమిటనే చర్చ జరుగుతోంది. నెల కిందటే స్వయంగా అధినాయకుడితోనే తన నిర్ణయాన్ని పంచుకున్న కేశినేని విషయంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎలాంటి సర్దుబాటు చర్చలకు ఆ పార్టీ ఉపక్రమించలేదు. దీన్నిబట్టి కేశినేని వదిలించుకోడానికే పార్టీ సిద్ధమయిందనే పుకార్లు వినిపిస్తున్నాయి.