ఓటీటీ వీరుడు మళ్లీ థియేటర్లలోకి

సినీ పరిశ్రమలో హీరో అయినా.. నిర్మాత అయినా.. దర్శకుడైనా కొంచెం నిలదొక్కుకుని తమకంటూ ఒక ఇమేజ్ సంపాదించారంటే.. ఆటోమేటిగ్గా ఆ కుటుంబం నుంచి వేరే వాళ్లు కూడా సినీ రంగంలోకి అడుగు పెట్టేస్తుంటారు. ఇక హీరోలు స్టార్ ఇమేజ్ సంపాదించాక వాళ్ల ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇండస్ట్రీలోకి రాకుంటే ఆశ్చర్యపోవాలి.

చిన్న స్థాయి నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పెద్ద స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ సైతం తన తమ్ముడిని పరిశ్రమలోకి తీసుకొచ్చాడు. విజయ్ తమ్ముడు ఆనంద్.. ‘దొరసాని’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఐతే ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. విమర్శకుల ప్రశంసలు తప్ప వసూళ్లు రాక బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన ‘దొరసాని’.. నటన పరంగా ఆనంద్‌కు విమర్శలు కూడా తెచ్చిపెట్టింది. అంతే కాక అతడి లుక్స్ విషయంలోనూ నెగెటివ్ కామెంట్లు తప్పలేదు.

ఈ దెబ్బతో ఆనంద్ హీరోగా నిలదొక్కుకోవడం కష్టమే అనుకున్నారు కానీ, అన్న అండతో మంచి అవకాశాలే సంపాదించిన అతను.. ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ సినిమాతో సక్సెస్ రుచి కూడా చూశాడు. ఈ చిత్రం గత ఏడాది అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజై మంచి స్పందన తెచ్చుకుంది. ప్రైమ్‌లో నేరుగా రిలీజైన పెద్ద సినిమాలు చాలా వరకు నిరాశ పరిస్తే ఈ చిన్న చిత్రానికి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్లలో రిలీజైనా కూడా ఈ సినిమా బాగా ఆడేదేమో. ఎలాగైతేనేం ఆనంద్ ఖాతాలో తొలి విజయం పడింది. ఈ ఊపులో మరిన్ని కొత్త చిత్రాలు లైన్లో పెట్టి చకచకా పూర్తి చేసేస్తున్నాడు. అందులో ఒకటి.. ‘పుష్పక విమానం’. కమల్ హాసన్ నటించిన క్లాసిక్ మూవీ టైటిల్ పెట్టుకుని వస్తున్న ఆనంద్.. మరోసారి ఓటీటీ బాట పడతాడని వార్తలొచ్చాయి.

కానీ ఈ చిత్రం ఎప్పుడో పూర్తయినప్పటికీ థియేట్రికల్ రిలీజ్ కోసమే ఆపారు. ఎట్టకేలకు దాని రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. నవంబరు 12న ‘పుష్పక విమానం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రంలో విజయ్ సొంత సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ కూడా భాగస్వామి కావడం విశేషం. మరి ఓటీటీలో సక్సెస్ అయిన ఆనంద్.. ఇప్పుడు థియేటర్లలోనూ విజయం అందుకుంటాడేమో చూడాలి.