జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్.. అవసరమైతే సాయం చేస్తాం

‘గులాబ్’ గుబులు ఏపీలో మొదలైంది. గులాబ్ తుఫాను వల్ల ఉత్తరాంధ్రకు తుఫాన్‌ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

శనివారం వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారిందని అధికారులు తెలిపారు. దీనికి పాకిస్థాన్‌ ‘గులాబ్‌’ (గుల్‌-ఆబ్‌) అనే పేరు పెట్టింది. ఆదివారం సాయంత్రం కళింగపట్నం- గోపాల్‌పూర్‌ (ఒడిసా) మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తరాంధ్రపై తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని జగన్‌కు ప్రధాని హామీ ఇచ్చారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని మోదీ ఆకాంక్షించారు. వాస్తవానికి ఈ రోజు జగన్ ఢిల్లీ ఉండాల్సి ఉంది.

ఈ రోజు దేశ రాజధానితో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్రమంత్రి అమిత్‌షా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించారు. ఢిల్లీ పర్యటన ముందు ఆయన వ్యాయామం చేస్తూ కింద పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలు బెనికినట్లు చెబుతున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. జగన్ స్థానంలో రాష్ట్ర హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఢిల్లీ వెళ్లారు.

అయితే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచే తుఫాను సహాయ చర్యలను జగన్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. సహాయ చర్యలకు ఉపక్రమించింది. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించారు. బారువ తీర ప్రాంత గ్రామాల్లో ఎస్పీ అమిత్ బర్దార్ పర్యటించారు. జిల్లాలో 75 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది.

వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్‌ తుఫాన్‌ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 140 కిలోమీటర్లు, కళింగపట్నానికి 190 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంధ్రలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురుస్తామని అధికారులు తెలిపారు.